Health Tips: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ విపరీతమైన వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది ఇళ్లకు రాగానే ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ వాటర్ తాగేస్తున్నారు. అదే సమయంలో ఏసీని ఫుల్ స్పీడ్లో ఆన్ చేసి గదిలో కూర్చుండిపోతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హీట్వేవ్ (వడగాల్పుల) సమయంలో ఐస్ వాటర్, ఏసీల మితిమీరిన వాడకం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఈ కథనంలో పరిశీలిద్దాం.
బయట ఎండలో తిరిగి రాగానే గొంతు ఎండిపోయి, చల్లటి నీరు తాగాలనిపించడం సహజం. కానీ తీవ్రమైన వేడిలో ఉన్న శరీరంపై ఒక్కసారిగా ఐస్ వాటర్ పడటం వల్ల ‘థర్మల్ షాక్’ (Thermal Shock) తగిలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి జీర్ణక్రియ ప్రక్రియ సైతం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఐస్ వాటర్ శరీరంలోని ముఖ్యమైన ‘వాగస్ నరాన్ని’ (Vagus Nerve) ప్రేరేపించి.. హృదయ స్పందన రేటు (Heart rate) ఒక్కసారిగా పడిపోయే చేస్తుందని చెబుతున్నారు. గొంతు నొప్పి, టాన్సిల్స్, శ్వాసకోశ సమస్యలు సైతం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఎండల దెబ్బకు తట్టుకోలేక రోజంతా ఏసీల్లోనే గడపడం కూడా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఏసీలు గదిలోని తేమను పీల్చేస్తాయని.. దీనివల్ల మనకు తెలియకుండానే శరీరం డీహైడ్రేషన్కు గురవుతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల చర్మం పొడిబారిపోయి మంట, దురద సమస్య రావొచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయం ఏసీలో కూర్చోవడం వల్ల కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు (Joint pains) రావడం వంటివి జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఏసీ ఫిల్టర్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిలో చేరే దుమ్ము, బ్యాక్టీరియా వల్ల ఆస్తమా, అలర్జీలు ఎక్కువవుతాయని వివరిస్తున్నారు.
వైద్యుల ప్రకారం.. ఉష్ణోగ్రతల్లో వచ్చే అకస్మిక మార్పు అన్నిటికంటే ప్రమాదకరం. 40 డిగ్రీల ఎండ నుంచి నేరుగా వచ్చి 18 డిగ్రీల ఏసీ రూమ్లోకి ప్రవేశించడం లేదా ఏసీ రూమ్ నుంచి నేరుగా ఎండలోకి వెళ్లడం వల్ల శరీరం ఆ ఉష్ణోగ్రత తట్టుకోలేదు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి జ్వరం, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు తక్షణమే రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఎండ నుంచి రాగానే ఫ్రిడ్జ్ వాటర్ తాగినా కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయని పేర్కొంటున్నారు.
Also Read: ఇక ఫ్రిడ్జ్ అవసరమే లేదు.. ఇంట్లోని మట్టి కుండనే ‘ఐస్’లా మార్చేయండి!
వేసవిలో ఫ్రిడ్జ్ నీళ్లకు బదులుగా కుండలో ఉంచిన చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బయట నుంచి రాగానే కనీసం 10 నుండి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుని శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చాక నీరు తాగాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏసీని మరీ చల్లగా కాకుండా 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని తెలియజేస్తున్నారు. మరోవైపు మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి సహజ పానీయాలు శరీరాన్ని చల్లబరచడానికి ఉత్తమమైన మార్గాలని తెలియజేస్తున్నారు. మెుత్తంగా తాత్కాలిక ఉపశమనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read: ఏసీలో వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావొచ్చు.. జాగ్రత్త భయ్యో!