Bikini Trend: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ పై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కు నోటీసులు జారీ చేసింది. Grok ఏఐ చాట్బాట్ ద్వారా ఉత్పత్తి చేసే కంటెంట్ నియంత్రణలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మరో 72 గంటల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.. లేదంటే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Grok ఏఐ ద్వారా రూపొందించే కంటెంట్ నియంత్రణపై ఎక్స్ తీసుకున్న చర్యల గురించి రిపోర్టు ఇవ్వాలని, ఇలాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ను వెంటనే తొలగించాలని నోటీసులో తెలిపింది. ఐటీ చట్టం, 2000, IT నియమాలు, 2021 కింద చట్టబద్ధమైన డ్యూ డిలిజెన్స్ బాధ్యతలను నెరవేర్చడంలో X విఫలమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గోర్క్ ఏఐ చాట్బాట్ స్త్రీలను లక్ష్యంగా చేసుకొని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్, డీప్ఫేక్ వీడియోలను రూపొందిస్తోందని కేంద్రానికి నివేదికలు అందాయి. దీంతో అభ్యంతరకరమైన కంటెంట్ను తక్షణమే తీసివేయాలని, అశ్లీల కంటెంట్ను క్రియేట్ చేసిన వినియోగదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే Grok AI ద్వారా మహిళల గోప్యత, గౌరవం దెబ్బతింటోందని ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసుల్లో స్పష్టం చేసింది. కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(BNSS), 2023 ప్రకారం తప్పనిసరి రిపోర్టింగ్ నిబంధనలను సైతం సంస్థ పాటించాల్సి ఉంటుందని వ్యాఖ్యానిచింది. X ఈ నోటీసులకు స్పందించకపోయినా, నిబంధనలను అతిక్రమించినా.. భారత్లో ఆ సంస్థకు ఉన్న Safe Harbor హోదాను కోల్పోతుందని హెచ్చరించింది.
భారత్లోని కొత్త చట్టం ప్రకారం.. X వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజర్స్ చేసే ప్రతి పోస్టుకు చట్టపరంగా సంస్థే బాధ్యత వహించాలి. అదనంగా భారతీయ న్యాయ సంహిత కింద క్రిమినల్ కేసులు, పోక్సో (పిల్లల రక్షణ చట్టం) కింద కఠిన చర్యలు, స్త్రీల అసభ్య ప్రాతినిధ్య నిషేధ చట్టం కింద పెనాల్టీలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.