అంతరిక్ష పరిశోధన రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత మానవుడిని మళ్లీ చంద్రుడి వద్దకు పంపే లక్ష్యంతో చేపట్టిన ఆర్టెమిస్-2 ప్రయోగం అద్భుత విజయాలను నమోదు చేస్తోందని చెప్పవచ్చు. ఈ యాత్రలో భాగంగా నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తున్న ఒరాయన్ వ్యోమనౌక భూమికి అత్యంత సుదూర ప్రాంతానికి చేరుకుంది. మొత్తం 4,06,773 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ద్వారా అంతరిక్ష చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డుగా నిలిచింది.
ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశమిదే..
ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.. చంద్రుడి ఉపరితలంపై మానవుడు శాశ్వత నివాసం ఏర్పరచుకునేందుకు కావాల్సిన పునాదులు వేయడమే. ఇందులో భాగంగానే నలుగురు వ్యోమగాములు చంద్రుడికి అత్యంత సమీపంలోకి వెళ్లారు. సాధారణంగా చంద్రుడి ముందు భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ ప్రయోగం ద్వారా వ్యోమగాములు చంద్రుడి అవతల వైపు ఉన్న చీకటి ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు. ఒరాయన్ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యను దాటుకుని వెనుక భాగానికి వెళ్లడం ద్వారా శాస్త్రవేత్తలకు సరికొత్త సమాచారం తెలియనుంది.
ఆర్టెమిస్ -2 సరికొత్త రికార్డ్
అంతరిక్ష యాత్రల చరిత్రలో ఇప్పటివరకు అపోలో మిషన్లు నెలకొల్పిన రికార్డులను ఆర్టెమిస్-2 అధిగమించింది. భూమి నుంచి ఇంత సుదూర ప్రాంతానికి చేరుకోవడం మానవ మేధస్సుకు ఒక నిదర్శనంగా నిలుస్తోందని చెప్పవచ్చు. వ్యోమగాములు అక్కడ ఉండే రేడియేషన్ ప్రభావాలను తట్టుకుంటూ సురక్షితంగా ప్రయాణించడం విశేషం.
ఈ 10 భూమికి తిరిగిరానున్న వ్యోమగాములు
ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంటున్న ఒరాయన్ వ్యోమనౌక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతోంది. ప్రణాళిక ప్రకారం ఈ నెల 10వ తేదీన వ్యోమగాములు తిరిగి భూమికి చేరుకోనున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వ్యోమనౌకను సురక్షితంగా దించేందుకు నాసా బృందాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ యాత్ర విజయవంతమైతే తదుపరి ప్రయోగం ఆర్టెమిస్-3 ద్వారా చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు కాలు మోపుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, సామాన్యులు ఈ చారిత్రక ఘట్టం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Artemis 2 Mission: చూసేందుకు కాదు.. పాగా వేసేందుకు.. ‘ఆర్టెమిస్ 2’ ప్లాన్ ఇదే!