India Heat Risk: 2050 నాటికి సుమారు కోట్ల మంది ప్రజలు ప్రమాదకరమైన ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందా? ఈ తీవ్రమైన వేడి పరిస్థితులకు ప్రధాన కారణం ఏమిటి? ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ప్రపంచంలోని ఏ ప్రాంతాలు అత్యధికంగా ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి ? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ తాజా పరిశోధనలు వెల్లడించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న శిలాజ ఇంధనాల వినియోగం ఇలాగే ఉంటే, ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది తీవ్రమైన వేడి పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
2010లో ప్రమాదకరమైన ఉష్ణోగ్రతలకు గురైన జనాభా శాతం 23% ఉండగా, 2050 నాటికి అది 41%కి చేరుకునే అవకాశం ఉందని, అంటే సుమారు 3.79 బిలియన్ల ప్రజలు ముప్పులో ఉన్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. పారిశ్రామిక విప్లవం కంటే ముందున్న ఉష్ణోగ్రతల కంటే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఈ దారుణమైన పరిస్థితులు తప్పవని ‘నేచర్ సస్టైనబిలిటీ’ పత్రికలో ప్రచురితమైన ఈ నివేదిక పేర్కొంది.
ప్రధానంగా ఉష్ణమండల, ఉప ఉష్ణమండల దేశాలపై ఈ ప్రభావం అత్యధికంగా ఉండబోతోంది. జనాభా ఎక్కువగా ఉన్న భారత్, నైజీరియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లోని ప్రజలు తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి ఏటా 3000 కంటే ఎక్కువ ‘కూలింగ్ డిగ్రీ డేస్’ (CDD) ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఇండోర్ వాతావరణాన్ని చల్లబరచడానికి అవసరమైన శక్తి డిమాండ్ కూడా పెరుగుతుందని పరిశోధనలు వెల్లడించాయి. ఉదాహరణకు, 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలతో పోలిస్తే, 2 డిగ్రీల సెల్సియస్ ప్రపంచంలో నైజీరియాలో 16%, బ్రెజిల్లో 20%, ఉగాండా, లావోస్లో 25% వరకు కూలింగ్ అవసరాలు పెరుగుతాయట.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాలు తగ్గిపోతున్నాయట. “అత్యంత చల్లని” ప్రాంతాల్లో నివసించే జనాభా వాటా 14% నుండి కేవలం 7% కి పడిపోవచ్చని పరిశోధన చెబుతోంది. దీనివల్ల ఆర్థిక అసమానతలు కూడా పెరగనున్నాయి. కెనడా, రష్యా, స్వీడన్ వంటి సంపన్న ఉత్తర దేశాలలో వేడి అవసరాలు (Heating needs) తగ్గి ఇంధన ఆదా జరుగుతుండగా, మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో కూలింగ్ కోసం విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగి ఆర్థిక భారం పడుతుంది. ఇంగ్లండ్, ఆస్ట్రియా వంటి చల్లని దేశాలలో కూడా గతంతో పోలిస్తే వేడి రోజులు రెట్టింపు కానున్నాయి. ఈ దేశాల్లోని భవనాలు వేడిని నిలిపి ఉంచేలా నిర్మించబడటం వల్ల, స్వల్ప ఉష్ణోగ్రత పెరుగుదల కూడా అక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందట.
ఆక్స్ఫర్డ్ మార్టిన్ ఫ్యూచర్ ఆఫ్ కూలింగ్ ప్రోగ్రామ్ నాయకురాలు డాక్టర్ రాధికా ఖోస్లా ఈ అంశంపై మాట్లాడుతూ, ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ను మించి పెరిగితే విద్య, ఆరోగ్యం, వలసలు, వ్యవసాయంపై అపూర్వమైన ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. నెట్-జీరో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా రాజకీయ నాయకులు తక్షణమే అడుగులు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇది భవిష్యత్తులో వచ్చే సమస్య కాదు, ప్రస్తుతం మన కళ్లముందు జరుగుతున్న వాస్తవం అని, వచ్చే పదేళ్లలో మనం తీసుకునే నిర్ణయాలే బిలియన్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.