Samsung Galaxy Z Fold 8: ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న శాంసంగ్.. ఇప్పుడు తమ డిస్ప్లేపై వచ్చే మడత గీత (Crease) సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే పనిలో పడింది. త్వరలోనే యాపిల్ తమ మొదటి ఫోల్డబుల్ ఫోన్ను పరిచయం చేయనుండటంతో, అంతకంటే ముందే మార్కెట్లో పైచేయి సాధించాలని శాంసంగ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది రాబోయే సరికొత్త మోడల్లో మునుపటి కంటే చాలా మందపాటి గ్లాస్ను వాడాలని డిసైడ్ అయింది.
తాజా నివేదికల ప్రకారం.. ఈ ఏడాది శాంసంగ్ రెండు రకాల బుక్స్టైల్ ఫోల్డబుల్ ఫోన్లను తీసుకురానుంది. అందులో పొడవుగా ఉండే Galaxy Z Fold 8 Ultra మోడల్లో పాత 45-మైక్రాన్ల గ్లాస్నే వాడుతుండగా, వెడల్పుగా ఉండే Galaxy Z Fold 8 (వైడ్) మోడల్లో ఏకంగా 60-మైక్రాన్ల అల్ట్రాథిన్ గ్లాస్ను (UTG) ఉపయోగించనుంది. పాత మోడళ్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ మందం కలిగి ఉంటుంది. గ్లాస్ మందం పెరగడం వల్ల స్క్రీన్ మధ్యలో వచ్చే మడత గీత చాలా వరకు తగ్గిపోతుంది.
Also Read: ల్యాప్టాప్ చరిత్రలోనే మొదటిసారి.. 96GB గ్రాఫిక్స్ మెమరీతో Lenovo Yoga Pro 7!
కేవలం గ్లాస్ మందం పెంచడమే కాకుండా.. స్క్రీన్ కింద లేజర్ రంధ్రాలు ఉన్న ఒక ప్రత్యేకమైన మెటల్ ప్లేట్ను కూడా శాంసంగ్ అమరుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల స్క్రీన్ను మడతపెట్టినప్పుడు ఒత్తిడి ఒకేచోట పడకుండా సమానంగా విస్తరిస్తుంది. దీనివల్ల ఫోల్డింగ్ స్క్రీన్ మునుపటి కంటే 20 శాతం మరింత ఫ్లాట్గా, నునుపుగా మారుతుందని అంచనా. అయితే, గ్లాస్ మందంగా ఉంటే కిందపడినా తట్టుకుంటుంది కానీ, పదే పదే మడవటం వల్ల త్వరగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే శాంసంగ్ దీనిని ముందుగా పరిమిత సంఖ్యలో (వైడ్ మోడల్లో) పరీక్షించనుంది.
మరోవైపు యాపిల్ కూడా iPhone 18 Pro సిరీస్తో పాటు తమ ఫోల్డబుల్ ఫోన్ను ఇదే ఏడాది రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అయితే యాపిల్ తమ స్క్రీన్ను బలోపేతం చేయడానికి గ్లాస్ టెక్నాలజీని నమ్ముకోగా, శాంసంగ్ మాత్రం మెటల్ ప్లేట్ సహాయం తీసుకుంటోంది. ఇలా రెండు దిగ్గజ కంపెనీలు ఒకే సమస్యకు రెండు వేర్వేరు దారులను ఎంచుకున్నాయి. కాబట్టి ఈ ఏడాది ఫోల్డబుల్ మార్కెట్లో అసలైన పోటీ మొదలుకానుంది.
భారత్లో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు మంచి క్రేజ్ ఉంది. గతేడాది వచ్చిన Z Fold 7 ధర సుమారు రూ.1,74,999గా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే కొత్త మోడళ్లు, అలాగే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ధరలు అంతకంటే ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంది. ఇంత భారీ ధర పెట్టే కస్టమర్లకు స్క్రీన్ మధ్యలో గీత కనిపించకుండా ఉండటమే అత్యంత కీలకమైన అంశం.
Also Read: కొంపముంచిన చిప్ల కొరత.. వివో ఫోన్ల రేట్లు పెరిగాయి.. కొత్త ధరలు ఇవే!