Galaxy Phone Explode| శాంసంగ్ కంపెనీ అంటే మార్కెట్లో ఓ నమ్మకమైన బ్రాండ్. అందుకే ప్రపంచంలో అత్యధిక ఫోన్స్ లో చాలాకాలంగా శాంసంగ్ బ్రాండ్ ఫోన్స్ ఎక్కువ. తక్కువ బడ్జెట్, మిడ్ రేంజ్, ప్రీమియం ప్రతి రేంజ్ యూజర్ల కోసం శాంసంగ్ ఫోన్స్ ఉన్నాయి. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఫ్లాగ్షిప్ సిరీస్ అయిన గెలాక్సీ S సిరీస్ ఫోన్లకు మంచి డిమాండ్. ఇప్పటివరకు గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లు లేటెస్ట్. అయితే తాజాగా ఒక షాకింగ్ ఘటన జరిగింది.
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ (Samsung Galaxy S25 Plus) ఫోన్ రాత్రివేళ ఛార్జింగ్ చేస్తుండగా పేలిపోయింది. ఈ ఫోన్ కొన్ని నెలల ముందే (సెప్టెంబర్ 2025లో) కొనుగోలు చేసింది. పేలుడు జరిగినప్పుడు ఫోన్ ఒరిజినల్ శాంసంగ్ ఛార్జర్తో కనెక్ట్ చేయబడి ఉంది. దీని వల్ల ఇంట్లో ఉన్న కార్పెట్కు నిప్పు అంటుకుంది. ఆ తరువాత గది నిండా పొగ వ్యాపించింది. ఈ పొగ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఒక పిల్లాడు సైతం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే మంటలు కార్పెట్కు మాత్రమే పరిమితమయ్యాయి. సమయం ఉండగా.. మంటలను ఆర్పివేశారు.
ఫోన్ కొనుగలు చేసిన యూజర్ (బాధితుడు) జరిగిన విషయాన్ని శాంసంగ్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. అతను ఫైర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్, మెడికల్ రికార్డులు, ఛార్జింగ్ ఎక్విప్మెంట్ రుజువులు వంటి అనేక డాక్యుమెంట్లు కూడా కంపెనీకి సమర్పించాడు. ఫోన్, ఛార్జర్ రెండూ ఒరిజినల్ శాంసంగ్ బ్రాండ్వేనని, థర్డ్-పార్టీ యాక్సెసరీలు ఉపయోగించలేదని స్పష్టం చేశాడు. ఛార్జింగ్ సాధారణ విధంగానే జరిగిందని చెప్పాడు. దాదాపు రెండు నెలల పాటు శాంసంగ్తో సంప్రదింపులు జరిపాడు.
రిపోర్టుల ప్రకారం.. బాధితుడి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి $500 (సుమారు రూ.45,000) చొప్పున శాంసంగ్ ఇన్సూరెన్స్ టీమ్ పరిహారం ఇచ్చిందని తెలిసింది. కానీ దీని గురించి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో ఆన్లైన్లో చర్చలు, గందరగోళం మొదలయ్యాయి.
Also Read: మనిషిని చూడగానే పేరు, ఉద్యోగం, అడ్రస్ చెప్పేస్తున్న ఏఐ గ్లాసెస్.. ప్రమాదంలో ప్రైవెసీ..
సంఘటన గురించి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా ప్రతినిధి ద్వారా అధికారిక స్టేట్మెంట్ ఇచ్చింది. కస్టమర్ సేఫ్టీ తమకు అత్యంత ప్రాధాన్యం అని చెప్పింది. అన్ని పరికరాల్లో కఠినమైన క్వాలిటీ చెక్లు ఉంటాయని తెలిపింది. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేశామని, మాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏదీ ధృవీకరించలేదని చెప్పింది. ఏదైనా నిర్దిష్ట టెక్నికల్ కారణం కనుగొనలేదని కూడా తెలిపింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. శాంసంగ్ బాధ్యతను స్వీకరించి, ఫోన్ ధర, మెడికల్ బిల్లులు, ఇంటి నష్టాలు తదితర ఖర్చులను భరిస్తుందని ఒప్పుకుంది. అధికారులతో సహకరిస్తున్నామని, యూజర్ సేఫ్టీకి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది.
స్మార్ట్ఫోన్లు రాత్రివేళ ఛార్జింగ్ చేయడం చాలా మందికి అలవాటు. ఇలాంటి ఘటనలు బ్యాటరీ సేఫ్టీపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. కంపెనీ ఒరిజినల్ ఛార్జర్లు మాత్రమే ఉపయోగించాలని, డ్యామేజ్ కేబుల్స్ ఉపయోగించవద్దని హెచ్చరిస్తోంది. ఇలాంటి సంఘటనలు జాగ్రత్తలు తీసుకోవాలనే సందేశం ఇస్తాయి.