Summer Safety Tips: ప్రస్తుత సమ్మర్ లో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం భారీగా పెరిగిపోతోంది. అయితే వేసవి తాపం మనుషులకే కాకుండా ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలకు సైతం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే.. పెను ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. కొందరు చేసే చిన్నపొరపాట్లు వల్ల.. అవి బ్లాస్ట్ అయ్యి అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చని సూచిస్తున్నారు. కాబట్టి వాటి నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన టిప్స్ ఏవో ఈ కథనంలో పరిశీలిద్దాం.
వేసవిలో అత్యధికంగా ప్రమాదాలకు గురయ్యేవాటిలో ఏసీలు ముందువరుసలో ఉంటాయి. ఇటీవల ఏసీలు పేలుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. సమ్మర్ లో ఏసీలను నిరంతరాయంగా వాడటం వల్ల అవి త్వరగా వేడెక్కుతాయి. కాబట్టి సమ్మర్ ప్రారంభానికి ముందే ఏసీని తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ చేయించకపోతే ఇప్పటికైనా టెక్నిషియన్ పిలిపించి.. ఏసీని శుభ్రం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. ఫిల్టర్లలో దుమ్ము ఉంటే గాలి సరిగ్గా రాక కంప్రెసర్ పై ఒత్తిడి పడి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఏసీని రోజంతా ఆన్ చేయకుండా.. మధ్యమధ్యలో కాసేపు విశ్రాంతి ఇవ్వడం మంచిదని పేర్కొంటున్నారు.
బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రిజ్ లోపల చల్లదనాన్ని కాపాడటానికి కంప్రెసర్ ఎక్కువ టైం పనిచేస్తుంటాయి. కాబట్టి ఫ్రిడ్జ్ ను గోడకు ఆనించి కాకుండా.. కనీసం 6 అంగుళాల దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అప్పుడు ఫ్రిడ్జ్ వేడెక్కిన ఆ గ్యాప్ నుంచి గాలి తగిలి.. వేడి బయటకు పోతుంది. మరోవైపు వేసవిలో కూలింగ్ను మీడియం కంటే కొంచెం ఎక్కువగా సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆహారం పాడవకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. మరోవైపు ఫ్రిడ్జ్ ను మాటిమాటికి తెరవడం వంటివి చేయవద్దని హితవు పలుకుతున్నారు. దీనివల్ల కూలింగ్ తగ్గి.. మోటార్ పై భారం పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు.
కొందరు కూలర్ లో నీరు లేనప్పటికీ వాటిని ఆన్ చేస్తుంటారు. దీని వల్ల మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది అగ్నిప్రమాదాలకు దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కూలర్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలను సైతం సూచిస్తున్నారు. కూలర్ ప్యాడ్స్ బాగా పాతబడితే వెంటనే మార్చడం మంచిదని స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల కూలర్ నుంచి చల్లని గాలి రావడమే కాకుండా విద్యుత్ ఆదా అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఎండల వల్ల పవర్ కట్స్, వోల్టేజ్ హెచ్చుతగ్గులు సహజం. కాబట్టి ఏసీలు, ఫ్రిడ్జ్ లు, టీవీలు వంటి ఖరీదైన ఎలక్ట్రిక్ వస్తువుల కోసం స్టెబిలైజర్లు వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు ఒకే ప్లగ్ పాయింట్ దగ్గర మల్టీ పిన్ సాకెట్లు పెట్టి ఏసీ, ఫ్రిజ్ వంటి పెద్ద పరికరాలను ఒకేసారి వాడొద్దని సూచిస్తున్నారు. దీనివల్ల సాకెట్ కాలిపోయే ప్రమాదం ఉందని, షార్ట్ సర్క్యూట్ కు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఏ పరికరమైనా పరిమితికి మించి హీటెక్కినా, శబ్దాలు చేసినా వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలని తెలియజేస్తున్నారు. టెక్నీషియన్ ను సంప్రదించే దానికి పరిష్కారం కనుగొనేవరకు అలాంటి వస్తువులు వాడకపోవడమే మంచిదని హితవు పలుకుతున్నారు.
Also Read: సూపర్ స్టార్ వ్యూహం.. దళపతికి చెక్! విజయ్ సీఎం కాకుండా రజనీకాంత్ అడ్డుపడుతున్నారా?