Superblu Ethanol Stove: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ లో ఎల్ పీజీ గ్యాస్ లభ్యతపై అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ఫలితంగా గ్యాస్ ధరలు సైతం భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎల్ పీజీపై భారీగా ఆధారపడటాన్ని తగ్గించి.. కిచెన్ లో దానికి ప్రత్యామ్నాయంగా నిలిచే సరికొత్త సూపర్ బ్లూ ఇథనాల్ స్టవ్ (Superblu Ethanol Stove) ను అభివృద్ధి చేశారు. ఇది ఎల్ పీజీ కంటే తక్కువ ఖర్చుతో లభించడంతో పాటు పర్యావరణానికి సైతం ఏంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ స్టవ్ కు సంబంధించిన కీలక విషయాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
కొత్తగా అభివృద్ధి చేసిన సూపర్ బ్లూ స్టవ్.. వంట గ్యాస్ (LPG)కు బదులు ఇథనాల్ అనే ద్రవంతో పనిచేస్తుంది. ఈ ఇథనాల్ అనేది ఒకరకమైన ఆల్కహాల్ లాంటి పదార్థం. సాధారణంగా చక్కెర పరిశ్రమ నుండి వచ్చే వేస్టేజ్ పదార్ధం మొలాసిస్ నుంచి ఈ ఇథనాల్ ను తయారు చేస్తారు. అలాగే పండించిన ధాన్యాల నుండి కూడా దీనిని వెలికి తీస్తారు. ‘సూపర్బ్లూ’ సాంకేతికత ద్వారా ఈ ఇంధనాన్ని సమర్థవంతంగా మండించి స్టవ్ ద్వారా వంట చేసుకోవచ్చు.
ఎల్ పీజీ సిలిండర్ల ధరలతో పోలిస్తే ఇథనాల్ చౌకగా లభించే అవకాశం ఉంది. 1 లీటర్ ఇథనాల్తో సుమారు 15 గంటల పాటు వంట చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ స్టవ్ల కంటే 5 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం.. 2,000 కోట్ల లీటర్లు దాటినందువల్ల వీధి వ్యాపారులు, చిన్న హోటల్స్, గృహ ప్రయోజనాలకు విస్తృత స్థాయిలో వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు.
కిరోసిన్ లేదా కట్టెల పొయ్యిలా కాకుండా.. ఇథనాల్ మండినప్పుడు పొగ, మసి (Soot) రాదు. ఇది కేవలం కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. కాబట్టి పర్యావరణ పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టం ఉండదు. అలాగే LPG సిలిండర్ల మాదిరిగా పేలిపోయే ప్రమాదం (Explosion risk) వీటిలో తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వంటగదిలో సూపర్ బ్లూ స్టవ్ ప్రవేశపెడితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని తయారీ దారులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 45 లక్షల మంది చిన్నపాటి ఫుడ్ వ్యాపారం (Street Food Vendors) చేసే వారు ఉన్నారు. LPG వాడకంపై ఆంక్షలు ఉన్న చోట, ఖర్చు తగ్గించుకోవాలనుకునే వారికి సూపర్ బ్లూ స్టవ్ ప్రత్యామ్నాంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ఖర్చులోనే ఇథనాల్ లభించడం వల్ల ఆర్థిక ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు.
మరోవైపు సూపర్ బ్లూ స్టవ్ వినియోగం పెరిగితే.. ఇథనాల్ కు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా ఇథనాల్ ఉత్పత్తి మరింత పెరిగి.. చెరకు, ఇతర ధాన్యాలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అంతేకాకుండా ఇథనాల్ సరఫరా గొలుసు (Supply Chain) ద్వారా కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
Also Read: చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని గుర్తుపెట్టుకో.. ఎవరినీ వదిలిపెట్టను.. అంబటి స్ట్రాంగ్ వార్నింగ్!
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2026 చివరి నాటికిపెట్రోల్లో 20% ఇథనాల్ కలిపే (E20) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇప్పుడు వంట గ్యాస్కు బదులుగా కూడా ఇథనాల్ను వాడే అంశంపై ప్రభుత్వం.. క్షేత్ర స్థాయిలో అధ్యయనాలు ప్రారంభించింది. ముఖ్యంగా సహకార్ మహర్షి శంకర్రావ్ కోల్హే షుగర్ ఫ్యాక్టరీ వంటి సంస్థలు ‘ఆత్మనిర్భర్ భారత్’ లో భాగంగా ఇటువంటి స్టవ్లను అభివృద్ధి చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు ముందుకొచ్చి సూపర్ బ్లూ స్టవ్ లు ఉత్పత్తి చేస్తే పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
Also Read: సీఎం రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత.. 144 సెక్షన్ విధింపు.. బీజేపీ నిరసనలతో హై అలర్ట్!