Wet Phone in Rice: వర్షంలో బయటకు వెళ్లినప్పుడో.. లేదా తెలియకుండా చేతిలోంచి నీళ్ల బకెట్లో పడినప్పుడో ఫోన్ తడిసిపోవడం మనలో చాలామందికి ఎదురయ్యే సమస్యే. అలాంటప్పుడు అందరికీ గుర్తొచ్చే మొదటి చిట్కా.. ఫోన్ను తీసుకెళ్లి బియ్యం డబ్బాలో పెట్టడం. బియ్యం నీటిని త్వరగా పీల్చేస్తుందని, ఫోన్ మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుందని నమ్ముతారు. మరి టెక్ నిపుణులు దీని గురించి ఏమంటున్నారో తెలుసుకుందామా..
బియ్యం తేమను పీల్చుకుంటుందనేది నిజమే అయినప్పటికీ.. అది ఫోన్ లోపల ఉండే తడిని పూర్తిగా ఆరబెట్టలేదు. పైగా బియ్యంలో ఉండే చిన్న చిన్న పిండి రేణువులు, దుమ్ము ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ లోపలికి చేరిపోతాయి. ఆ తేమతో ఈ పిండి కలవడం వల్ల లోపల ఒక చిన్న పేస్ట్లా తయారై, ఫోన్ శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే యాపిల్, శాంసంగ్ లాంటి పెద్ద కంపెనీలు కూడా తమ అఫీషియల్ గైడ్లైన్స్లో ‘ఫోన్ను బియ్యంలో పెట్టకండి’ అని స్పష్టంగా చెప్తున్నాయి.
Also Read: ఐఫోన్ వాడుతున్నారా? వాట్సప్లో వచ్చిన ఈ కొత్త మార్పు చూశారా.. ఇక పండగే!
చాలా సార్లు బియ్యంలో పెట్టడం వల్లే ఫోన్ బాగుపడిందని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి అక్కడ పనిచేసింది బియ్యం కాదు.. సమయం. ఫోన్ను అలాగే పక్కన పెట్టడం వల్ల, గాలి తగిలి లోపల ఉన్న నీరు సహజంగానే ఆరిపోతుంది. అంతేకానీ బియ్యానికి ఉన్న మాయాజాలం ఏమీ కాదు. ఆ సమయంలో ఫోన్ను ఆన్ చేయడానికి ప్రయత్నించడమే మనం చేసే పెద్ద తప్పు.
ఫోన్ నీటిలో తడిస్తే మొదట చేయాల్సింది దాన్ని స్విచ్ఛాఫ్ చేయడం. ఆ తర్వాత మెత్తటి పొడి గుడ్డతో పైన ఉన్న నీటిని తుడిచేయాలి. సిమ్ కార్డ్ ట్రేని బయటకు తీసి, ఫోన్ను బాగా గాలి ఆడే చోట లేదా ఫ్యాన్ కింద కనీసం 24 గంటల పాటు కదల్చకుండా ఉంచాలి. గాలికి సహజంగా ఆరిపోవడమే అన్నిటికంటే సురక్షితమైన పద్ధతి.
ఫోన్ త్వరగా ఆరిపోవాలని హెయిర్ డ్రైయర్ వాడటం చాలా ప్రమాదకరం. డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలి ఫోన్లోని ప్లాస్టిక్ భాగాలను కరిగించడమే కాకుండా.. నీటి చుక్కలను మరింత లోపలికి నెట్టేస్తుంది. అలాగే ఫోన్ను ఎండలో పెట్టడం, ఛార్జింగ్ పెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. కాస్త ఓపిక పడితేనే ఫోన్ను కాపాడుకోగలుగుతాం.
Also Read: రోజుకు కేవలం 5 రూపాయలే.. Airtel కస్టమర్లకు పండగే.. ఏడాది మొత్తం అన్లిమిటెడ్ కాల్స్!