Airtel Annual Prepaid Plan: మొబైల్ రీఛార్జ్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో సామాన్యుడికి ఊరటనిచ్చే వార్తను మోసుకొచ్చింది ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఏయిర్టెల్. కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఎక్కువ మొబైల్ వాడే వారి కోసం ఒక అద్భుతమైన వార్షిక ప్లాన్ను ప్రవేశపెట్టింది. రూ.1,849 ధరతో లాంచ్ అయిన ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా ఏడాది పొడవునా ఫోన్ మాట్లాడవచ్చు.
ప్రతి నెలా రీఛార్జ్ డేట్ గుర్తుపెట్టుకోవడం, గడువు ముగిసిపోగానే అర్ధరాత్రి అయినా సరే తలపట్టుకోవడం అందరికీ పరిపాటిగా మారింది. ఈ కొత్త ప్లాన్తో ఆ ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు. ఒకే ఒక్కసారి రూ.1,849 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే చాలు.. 365 రోజుల పాటు మళ్లీ రీఛార్జ్ చేయాలనే ఆలోచనే రాదు. పదే పదే డేట్లు చూసుకునే అవసరం లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకునే వారికి ఇదొక గొప్ప ఉపశమనం.
ప్రస్తుతం భారతదేశంలో Airtelకు 41 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. అందరి అవసరాలు ఒకేలా ఉండవని గ్రహించిన సంస్థ, ఈ ప్లాన్ను కేవలం వాయిస్ కాల్స్ కోసమే డిజైన్ చేసింది. దీనిలో రోజువారీ ఉచిత డేటా లాంటివేమీ ఉండవు. ఇంటి వద్ద లేదా ఆఫీసులో వై-ఫై సౌకర్యం ఉండి, మొబైల్ డేటాతో పెద్దగా పనిలేని వారికి, అలాగే కేవలం ఫోన్ మాట్లాడటానికే మొబైల్ వాడే పెద్దవారికి ఈ ప్లాన్ బాగా సెట్ అవుతుంది.
Also Read: ఇన్స్టాగ్రామ్లో సరికొత్త పెయిడ్ ప్లాన్.. ఉచితంగా వాడేవారి పరిస్థితి ఏంటి బాబోయ్?
కొందరికి కేవలం ఒక ప్రత్యామ్నాయ (సెకండరీ) సిమ్ కార్డ్ అవసరం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లకు, అత్యవసర కాల్స్ కోసం మాత్రమే దాన్ని వాడుతుంటారు. అలాంటి వారు సిమ్ ఎక్కడ బ్లాక్ అయిపోతుందోనని ప్రతి నెలా వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ వార్షిక ప్లాన్తో చాలా తక్కువ ఖర్చులోనే ఏడాది పొడవునా సిమ్ యాక్టివ్గా ఉంటుంది. తల్లిదండ్రుల ఫోన్లకు కూడా ఒక్కసారి ఈ రీఛార్జ్ చేస్తే ఏడాది దాకా మనం పట్టించుకోవాల్సిన పని ఉండదు.
మరి ఫోన్ కాల్స్తో పాటు కొద్దిగా ఇంటర్నెట్ కూడా కావాలనుకునే వారి పరిస్థితి ఏంటి? దానికోసం కూడా Airtel ఒక ప్లాన్ ఉంచింది. రూ.2,249తో రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్తో పాటు ఏడాది మొత్తానికి 30GB డేటా లభిస్తుంది. రోజూ వాట్సప్ మెసేజ్లు చూసుకోవడానికి, చిన్న చిన్న మెయిల్స్, యూపీఐ పేమెంట్లు చేసుకోవడానికి ఈ డేటా సరిపోతుంది.
Also Read: ఐఫోన్ లవర్స్కు ఊహించని షాక్.. ఈ ఏడాది iPhone 18 లాంచ్ లేనట్టేనా? యాపిల్ అసలు ప్లాన్ లీక్!