OnePlus Phones: స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ప్లస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ఇప్పటివరకు అందిస్తూ వచ్చిన ప్రముఖ ఆక్సిజన్ OSకు గుడ్ బై చెప్పాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీనికి బదులుగా ఇకపై పూర్తిగా కలర్ఓఎస్ను మాత్రమే తీసుకురానుంది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సాఫ్ట్వేర్ నిర్వహణను మరింత సులభం చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ టిప్స్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే కలర్ఓఎస్ 17 అప్డేట్ వన్ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు పాపులర్ నార్డ్ సిరీస్ ఫోన్లకు కూడా రానుంది. ఆండ్రాయిడ్ 17 బేస్గా రాబోయే ఈ కొత్త అప్డేట్తో ఫోన్ల వాడకంలో కొన్ని మార్పులు రానున్నాయి. కేవలం స్మార్ట్ఫోన్లే కాకుండా వన్ప్లస్ ట్యాబ్లెట్లకు కూడా ఇదే సాఫ్ట్వేర్ వర్తిస్తుందని అంటున్నారు.
Also Read: బెడ్టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?
ఈ కొత్త అప్డేట్ లిస్ట్లో వన్ప్లస్ 11, 12, 13 సిరీస్లతో పాటు లేటెస్ట్ మోడల్స్ అయిన వన్ప్లస్ 15, అలాగే వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ కూడా ఉన్నాయి. ఇక మిడ్రేంజ్ యూజర్ల కోసం వన్ప్లస్ నార్డ్ 4, నార్డ్ 5, నార్డ్ సీఈ సిరీస్లకు చెందిన పలు ఫోన్లు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. త్వరలోనే దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
2014లో వన్ప్లస్ వన్ ఫోన్తో ప్రారంభమైన ప్రయాణంలో ఆక్సిజన్ OS ఒక భావోద్వేగంతో కూడుకున్న అంశం. ఇప్పుడు దాన్ని పక్కనపెట్టి కలర్ఓఎస్ను తేవడం పాత వన్ప్లస్ లవర్స్కు కాస్త నిరాశ కలిగించవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ చేయనున్న మార్పులు పూర్తిగా అమల్లోకి రానుండటంతో, కొత్త సాఫ్ట్వేర్ యూజర్లను ఏ విధంగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read: వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!