సోషల్ మీడియా.. ఇందులో మంచి కంటే చెడే ఎక్కువగా నడుస్తుంది. ఫేక్ వార్తల నుంచి అశ్లీల ఫొటోల వరకు ప్రతి ఒక్కటీ ఇక్కడ వైరల్ అవుతాయి. అందుకే, ఇప్పటితరం విలువలకు మంగళం పలికి.. విచ్చలవిడి కంటెంట్తో రెచ్చిపోతున్నారు. ఆ చెత్తను కంట్రోల్ చేయడంలో పోలీసులు కూడా విఫలం అవుతున్నారు. చెప్పాలంటే.. అస్సలు పర్యవేక్షణే లేదు. ఫలితంగా.. సోషల్ మీడియా ఒక రొంపిలా మారింది. అందుకే, కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంటెంట్ పేరుతో కంత్రీ పనులు చేసే క్రియేటర్లకు చుక్కలు చూపించేందుకు AIని రంగంలోకి దింపింది. అదే.. SMAS (స్మాస్).
SMAS అంటే.. సోషల్ మీడియా అనాలిటిక్స్ సొల్యూషన్ (Social Media Analytics Solution). ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (AI) సపోర్టుతో నడుస్తుంది. సోషల్ మీడియాలో జనాలు పెట్టే ప్రతి పోస్టుపైనా ఫోకస్ పెట్టనుంది. అందులో ఏదైనా ‘తేడా’ పోస్టులు కనిపిస్తే వెంటనే.. చర్యలు తీసుకుంటుంది. ఈ టెక్నాలజీ కోసం కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.67 కోట్లు వెచ్చించింది. అయితే, ఈ నిర్ణయం చాలామందికి నచ్చడం లేదు. దీనిపై ప్రస్తుతం పెద్ద చర్చే నడుస్తోంది.
ఇదో పెద్ద రోబోట్ సాయంతో పనిచేస్తుంది. కర్ణాటక నుంచి పోస్టయ్యే ప్రతి కంటెంట్ను ఇది పరిశీలిస్తుంది. కామెంట్లతో సహా ప్రతి దాన్ని స్కాన్ చేస్తుంది. డైలీ 24 x 7 పనిచేస్తుంది. ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్, బూతులు, అసత్య ప్రచారాలను కనిపెడుతుంది. అలాగే సోషల్ మీడియా సాయంతో జనాలను రిక్రూట్ చేసుకొనేందుకు ప్రయత్నించే టెర్రరిస్టు యాక్టీవిటీస్పై కూడా నిఘా పెడుతుంది. మనుషులు కూడా కనిపెట్టలేని అతి సూక్ష్మమైన విషయాలను కూడా ఇది తెలుసుకుంటుంది. అదే ఇప్పుడు కొందరికి సమస్యగా మారింది.
స్మాస్ గురించి కర్ణాటక న్యాయ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియా అనేది చాలా పెద్ద వ్యవస్థ. దాన్ని సాధారణ మనుషులు నిగా పెట్టడం కష్టం. కొన్ని సెకన్ల వ్యవధిలో మిలియన్లకొద్ది పోస్టులు పడుతుంటాయి. పోలీసులు అవన్నీ చూడటం కష్టం. కేవలం టెక్నాలజీతోనే వేగంగా, ప్రభావంతంగా నిఘా పెట్టగలం’’ అని తెలిపారు. అయితే, ప్రభుత్వానికి సోషల్ మీడియా అంటే భయమే. ప్రభుత్వం చేసే చిన్న తప్పును కూడా సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఇక రాజకీయ పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. బూతులతో మొదలుకొని బెదిరింపుల వరకు ప్రతి ఒక్కటీ ఇక్కడ చూస్తున్నాం. స్మాస్ అందుబాటులోకి వస్తే.. భవిష్యత్తులో ఆ ‘ఎంటర్టైన్మెంట్’ ఉండకపోవచ్చు.
సోషల్ మీడియాను కొందరు భావ స్వాతంత్ర్యపు హక్కుగా భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై నిఘా పెట్టడమంటే.. జనాల గొంతు నొక్కడమే అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫేక్, రియల్ వార్తలను ఎలా గుర్తిస్తారు? హేట్ స్పీచ్? విమర్శలను ఎలా గుర్తిస్తారనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉదాహరణకు.. ఎవరైనా ఒకరు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం నచ్చలేదు అని అన్నారంటే.. అది హేట్ స్పీచ్గా భావిస్తారా? అని అడుగుతున్నారు. ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు జరుగుతున్న కుట్ర అని, చైనాలో కూడా ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చి జనాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా చేశారని పలువురు విశ్లేషకులు ఏకిపారేస్తున్నారు.
ఈ SMAS ప్రజల హక్కుల, దేశ రక్షణ కోసమే తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఉగ్రవాదులు ఆన్లైన్ ద్వారా జనాలను రిక్రూట్ చేసుకుంటున్నారని, అలాగే తప్పుడు సమాచారం అల్లర్లకు దారితీస్తోందని.. వాటిని కంట్రోల్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని తెలిపింది. అయితే, SMAS కేవలం అలాంటి పోస్టులను ‘ఫ్లాగ్’ మాత్రమే చేస్తుందని, వాటిని పూర్తిగా పరిశీలించాక చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో విచ్చలవిడితనానికి ఇది మంచి మందే. కానీ, దీన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజా సమస్యలను అణచివేతకు అస్త్రంగా మార్చుకుంటే మాత్రం నిరసనల సెగ తప్పదు. అందుకే.. స్మాస్, ఆదిలోనే వ్యతిరేకతకు గురవ్వుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటీ? సోషల్ మీడియాకు కళ్లెం వేయాల్సిందేనా?
Also Read: డెడ్ బాడీలనూ వదలని అమ్మాయిలు.. శవాల కొవ్వును, శరీరాల్లోకి ఎక్కించుకొని..