Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సిద్దిపేట వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబడుతూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి అతి గా వ్యవహరిస్తున్న అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘ఎక్స్ట్రాలు చేస్తే ప్రతి ఒక్కడి నట్లు, బోల్టులు ఫిట్ చేస్తా’ అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిబంధనలకు లోబడి పనిచేయాలని.. అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్షాలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు త్వరలోనే మారతాయని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ‘రెండేళ్ల తర్వాత వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేనే మంత్రిగా ఉంటాను’ అని ఆయన ప్రకటించడం విశేషం. తాము మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు ఇప్పుడు అతిగా ప్రవర్తించిన వారి లెక్కలన్నీ తేలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
‘మేము మర్యాద ఇస్తే మర్యాద తీసుకుంటాం.. మంచికి మంచిగా ఉంటాం. కానీ.. కావాలని తేడా వస్తే మాత్రం దేనికైనా సిద్ధం.. ఖబడ్దార్ అంటూ హరీష్ రావు తనదైన శైలిలో హెచ్చరించారు.
చివరిగా.. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాజ్యాంగం కల్పించిన విధులను సక్రమంగా నిర్వహించాలని ఆయన హితవు పలికారు. ప్రస్తుత ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి అక్రమ కేసులు పెడితే సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read: పెళ్లి కోసం తపన.. చివరికి 20వ అంతస్తు మీదకు ఎక్కి..
పోలీసులకు హరీశ్ రావు వార్నింగ్
రెండేళ్ల తర్వాత వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తానే మంత్రిగా ఉంటానని మాజీ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అతిగా వ్యవహరిస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇస్తూ.. "ఎక్స్ట్రాలు చేస్తే ప్రతి ఒక్కడి నట్లు, బోల్టులు ఫిట్ చేస్తా" అని హెచ్చరించారు.… pic.twitter.com/rCFmBDZcq7— ChotaNews App (@ChotaNewsApp) February 9, 2026