Xiaomi Price Hike: చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ కంపెనీ షావోమి (Xiaomi)కి భారత్ లో మంచి గుడ్ విల్ ఉంది. తక్కువ బడ్జెట్ లో అధునాతన ఫీచర్లను కలిగిన ఫోన్లను అందిస్తుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. అందుకే పెద్ద ఎత్తున మెుబైల్ లవర్స్.. షావోమి (Mi) ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా షావోమి ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి.. ఆ కంపెనీ భారీ షాక్ ఇచ్చింది. తన మూడు ప్రముఖ స్మార్ట్ ఫోన్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తన షావోమీ 15 సిరీస్ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. రూ.1500 నుండి రూ.3000 వరకూ ధరలను పెంచినట్లు తెలిపింది. వాస్తవానికి ఈ పెరుగుదుల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని షావోమి వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల ధరలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొన్నాయి. కాబట్టి వినియోగదారులు సహకరించాలని షావోమీ ప్రతినిధులు కోరారు.
షావోమి నిర్ణయంతో.. Redmi 15C 5G, Redmi 15 5G, Redmi Note 15 5G మోడళ్ల ధరలు పెరిగాయి. ఇందులో Redmi 15C 5G బేస్ వేరియంట్ ధర రూ. 1,500 పెరిగి ప్రస్తుతం రూ. 15,499 కి చేరుకుంది. అలాగే Redmi 15 5G మోడల్ ధర రూ. 2,000 పెరిగి రూ.18,499కి చేరింది. ప్రీమియం మోడల్ అయిన Redmi Note 15 5G ఏకంగా రూ.3000 పెరిగి.. రూ.27,999కి వచ్చింది.
స్మార్ట్ఫోన్లలో వాడే DRAM, NAND మెమరీ చిప్ల ధరలు గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 4 రెట్లు పెరిగాయని షావోమీ ప్రెసిడెంట్ లూ వీబింగ్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ సర్వర్లు, డేటా సెంటర్ల కోసం హై బ్యాండ్విడ్త్ మెమరీ వినియోగం పెరగడంతో మొబైల్ ఫోన్లకు అవసరమైన చిప్ల సరఫరా తగ్గిందన్నారు. తయారీ ఖర్చులు భారీగా పెరగడంతో ఆ భారాన్ని కంపెనీ పూర్తిగా భరించలేక కొంత మొత్తాన్ని వినియోగదారులపై వేయక తప్పడంలేదని షావోమీ స్పష్టం చేసింది.
Also Read: శాంసంగ్లో అద్భుతమైన హిడెన్ ఫీచర్.. తెలిస్తే ఆశ్చర్యపోవడం గ్యారంటీ!
చైనా మార్కెట్లో కూడా Redmi K90 Pro Max వంటి మోడళ్ల ధరలను షావోమి పెంచింది. దీంతో అక్కడి ప్రజలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ షావోమి బ్రాండ్ పై ఉన్న నమ్మకం, క్రేజ్ దృష్ట్యా ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు షావోమీతో పాటు రియల్మీ (Realme), వన్ ప్లస్ వంటి బ్రాండ్లు కూడా తమ మెుబైల్స్ ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఒప్పో, శాంసంగ్, ఇన్ఫినిక్స్ వంటి సంస్థలు సైతం ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: ఐర్లాండ్లో జాబ్.. రూ.96 లక్షల జీతం.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న టెక్కీ!