Michael Vaughan On Farewell Match: టీమిండియా ప్లేయర్లు ఈ మధ్య కాలంలో వరుసగా రిటైర్మెంట్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని నుంచి మొదలుకొని.. మొన్నటి అజింక్య రహానే వరకు చాలా మంది క్రికెటర్లు తమ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చారు. అయితే దిగ్గజ క్రికెటర్లు అందరూ రిటైర్మెంట్ ఇస్తున్నప్పటికీ.. ఏ ఒక్క ప్లేయర్ కు ఫేర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయలేదు బీసీసీఐ. ఆశిష్ నెహ్రకు మంచి ఫేర్ వేల్ మ్యాచ్ ఏర్పాటు చేసిన బీసీసీఐ… ఆ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చిన ఏ ఒక్క ఆటగాడిని పట్టించుకోలేదు.
రెండు వరల్డ్ కప్ లు తీసుకువచ్చిన మహేంద్ర సింగ్ ధోనికి కూడా అవమానమే జరిగింది. అయితే దీనిపై తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ (Michael Vaughan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ తమ నుంచే నేర్చుకున్నారు.. ఇక రిటైర్మెంట్ తర్వాత ఫెయిర్ వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా మమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంటూ బీసీసీఐకి కౌంటర్ ఇచ్చారు. దీంతో మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
టీమిండియా క్రికెటర్లు వరుసగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నప్పటికీ.. బీసీసీఐ నుంచి ఎలాంటి చలనం రావడం లేదు. రిటైర్మెంట్ ఇచ్చిన ప్లేయర్లకు ఫెయిర్ వెల్ మ్యాచ్ లు ఏర్పాటు చేయాలన్న కాస్త ఇంగిత జ్ఞానం కూడా బీసీసీఐకి ఉండటం లేదు. మ్యాచ్ లు పెట్టకపోయినా, చిన్న పార్టీ కూడా ఇవ్వడం లేదు. దీనిపై మైఖేల్ వాన్ సీరియస్ అయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా టీమిండియాకు సేవలు అందించిన క్రికెటర్లను బీసీసీఐ పట్టించుకోవడంలేదని ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. ఫేర్వెల్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు.
తమ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ( ECB)… అనామక ప్లేయర్ రిటైర్మెంట్ ఇచ్చినా, మంచి ఫేర్వెల్ అందిస్తుందని గుర్తు చేశారు. జేమ్స్ అండర్సన్ లాంటి క్రికెటర్లకు కూడా ఎంతో గొప్పగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కోట్లలో డబ్బులు ఉన్న బీసీసీఐ మాత్రం ఈ విషయంలో దారుణంగా వ్యవహరిస్తుందని ఆగ్రహించారు. రిటైర్మెంట్ ఇచ్చిన ప్లేయర్లను…దొంగల్లా ట్రీట్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు మైఖేల్ వాన్. ఆశిష్ నెహ్రాకు దక్కిన గౌరవం మిగిలిన రిటైర్మెంట్ ప్లేయర్లకు ఇవ్వాలని కోరారు.
2017 లో ఆశిష్ నెహ్రా రిటైర్మెంట్ ఇవ్వగా… అతనికి మంచి ఫేర్వెల్ మ్యాచ్ దక్కింది. ఆ తర్వాత ఏ క్రికెటర్ కు కూడా ఫేర్ వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, , శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, రవిచంద్రన్ అశ్విన్ తాజాగా అజింక్య రహానే లాంటి ప్లేయర్లకు ఫెయిర్ వెల్ మ్యాచ్ లు ఏర్పాటు చేయలేదు. వీడ్కోలు మ్యాచ్ లు లేకుండానే ఈ క్రికెటర్లు తమ రిటైర్మెంట్ ప్రకటించారు.