T20 WORLDCUP : టీ20 వరల్డ్ కప్ గ్రూప్ -1లో సెమీస్ బెర్తులు తేలిపోయాయి. న్యూజిలాండ్ తో పాటు ఇంగ్లాండ్ సెమీస్ లో ప్రవేశించింది. బట్లర్ సేన తన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరీ మోగించి సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సమిష్టి పోరాటంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక జట్టులో నిస్సాంక ఒక్కడే 67 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలి బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. దీంతో లంక జట్టు ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్నే నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3 వికెట్లు తీయగా ..స్టోక్స్ , వోక్స్, శామ్ కరన్, రషీద్ తలో వికెట్ తీశారు. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు బట్లర్ ( 28 పరుగులు), హేల్స్ ( 47 పరుగులు) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. దీంతో ఆ జట్టు 7.2 ఓవర్లలోనే తొొలి వికెట్ కు 75 పరుగులు సాధించింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడినా స్టోక్స్ ( 42 పరుగులు) ఆజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
శ్రీలంకపై ఇంగ్లాండ్ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలు దెబ్బతిన్నాయి. గ్రూప్- 1 లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఏడేసి పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్ రేట్ ఉన్న కివీస్, ఇంగ్లాండ్ సెమీస్ కు చేరాయి. దీంతో ఆస్ట్రేలియా ఇంటిముఖం పట్టింది. ఇక గ్రూప్ -2 లో సెమీస్ బెర్త్ లు తేలాల్సి ఉంది.