India Vs England 2nd Test Highlights:
విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. టీమ్ ఇండియా 399 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 332 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా చేతిలో 9 వికెట్లున్నాయి. రెండురోజుల ఆట మిగిలి ఉంది.
ఈ క్రమంలో మూడోరోజు చివరి సెషన్ లో ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. అప్పటికి 10 ఓవర్లు అయిపోయాయి. ఒక్క వికెట్ కూడా పడలేదు. ఐదుగురు బౌలర్లలో ముగ్గురిని రోహిత్ శర్మ ఉపయోగించాడు. ఫలితం లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా పడని అశ్విన్ చేతికి కెప్టెన్ రోహిత్ బాల్ ఇచ్చాడు.
అప్పటికి ఓపెనర్లు జాక్ క్రాలే (29*), బెన్ డకెట్ (28) వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బెన్ డకెట్ స్ట్రయికింగ్ లో ఉన్నాడు. అశ్విన్ తన ఓవర్ లో అయిదో బంతి వేశాడు.బెన్ డకెట్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కాకపోతే బ్యాట్ ఎడ్జ్ తీసుకుని తన ప్యాడ్లకు తగిలి బంతి గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ భరత్ సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి మెరుపు వేగంతో కదిలాడు. బంతి కిందపడుతుండగా తను కూడా డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ను అందుకున్నాడు. వెంటనే అంపైర్ ఔట్గా ప్రకటించాడు.
బెన్ డకెట్ నిస్సహాయంగా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ కి తొలి వికెట్ పడింది. టీమ్ ఇండియాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో నాలుగో రోజు ఉదయం నుంచి బౌలర్లు ఒత్తిడి పెంచితే, ఇంగ్లాండ్ ని త్వరగా ఆల్ అవుట్ చేయవచ్చునని సీనియర్లు అంటున్నారు.
ఎందుకంటే ఉదయం తేమ కారణంగా పేసర్లకి అనుకూలంగా ఉంటుందని సీనియర్లు అంటున్నారు. కొత్త బాల్ పిచ్ పై నుంచి జారి అనూహ్యంగా వికెట్లపైకి వెళుతుందని చెబుతున్నారు. ఇక బాల్ మెత్తపడిన తర్వాత స్పిన్నర్లకు టర్న్ అవుతుందని చెబుతున్నారు. భరత్ అద్భుతమైన క్యాచ్ తో ఇంగ్లాండ్ పతనం మొదలైనట్టేనని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.