WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అదరగొడుతోంది. ఐపీఎల్కు ధీటుగా స్కోర్ నడుస్తోంది. మహిళలు బ్యాట్తో, బాల్తో ఇరగదీస్తున్నారు. ఉమెన్స్ డే నాడు గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ అయితే అదిరిపోయింది. గుజరాత్ ఓపెనర్ సోఫియా.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయింది. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అదుర్స్ అనిపించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హీథర్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. మేఘన్ స్కట్, రేణుకా తలో వికెట్ తీశారు. ఓపెనర్ మేఘన (8) త్వరగా అవుటైనా.. ఇంకో ఓపెనర్ సోఫియా డంక్లీ (65; 28 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు) బ్యాట్తో రఫ్ఫాడించింది. హర్లీన్ డియోల్ (67; 45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడింది.
సోఫియా డంక్లీ బ్యాంటింగ్ చూసి తీరాల్సిందే. నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాదింది. ఐదో ఓవర్ను ఆటాడుకుంది. బౌండరీల మోత మోగించింది. వరుసగా 4,6,4,4,4 కొట్టి.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసింది. ఎనిమిదో ఓవర్లో సిక్సర్, ఫోర్ బాదగా.. చివరి బాల్కి క్యాచ్ అవుట్ అయింది.