
CSK: నిలకడైన ఆటకి నిలువెత్తు చిరునామా చెన్నై సూపర్ కింగ్స్. 14 సీజన్లలో పది సార్లు ఫైనల్కి చేరడం సీఎస్కే స్పెషాలిటీ. ఆ మిగతా నాలుగు సీజన్లలో కూడా రెండు సార్లు ప్లేఆఫ్స్ వరకు వెళ్లింది. కెప్టెన్ ధోనీ మహేంద్రజాలమే సీఎస్కేను ముందుకు నడిపిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఐపీఎల్ ప్రపంచంలోనే నంబర్ వన్ క్రికెట్ లీగ్. ఇక్కడ ఫైనల్ దాకా రావాలంటే లీగ్ దశలోని 14 మ్యాచెస్లో అగ్రశ్రేణి జట్లను దాటుకోవాలి. ప్లేఆఫ్స్లో నాకౌట్ కాకుండా తప్పించుకోవాలి. ఇంతటి క్లిష్టమైన మార్గం దాటుకుని సీఎస్కే జట్టు ఎలా దాదాపు ప్రతిసారీ ఫైనల్కు రాగలుగుతోంది? ఇందులో ఏదైనా మ్యాజిక్ ఉందా? అని మీరు ఎవరిని అడిగినా కూడా ఆ మ్యాజిక్ పేరు మహేంద్ర సింగ్ ధోనీ అని సగటు క్రికెట్ అభిమాని ఠక్కున చెబుతారు.
మొదటి సీజన్ నుంచి ఆ జట్టుకు సూత్రధారి, ప్రధాన పాత్రధారి, సారథి, మహారథి అన్నీ ధోనీయే. డాడ్స్ ఆర్మీ అని కొందరు అవహేళన చేసినా సరే బ్రావో, తాహిర్ లాంటి వయసు మీరిన ప్లేయర్లు ఈ టీమ్కు మంచి విజయాలు అందించారు. ధోనీ క్రికెట్ జట్టును నడిపించే తీరును కచ్చితంగా స్పోర్ట్స్ లెసన్ లో చెప్పుకోవచ్చు. సాదా సీదాగా కనిపించే ఆటగాళ్ళ లోని ప్రతిభ వెలికితీసి వాళ్ళను చాంపియన్ ప్లేయర్లుగా తీర్చిదిద్దడం ధోనీకే చెల్లింది. ఇదంతా చూస్తుంటే ఆయన దగ్గర మంత్రదండం ఏదైనా ఉందా అనే డౌట్ రాకమానదు. రవిచంద్రన్ అశ్విన్, మురళీ విజయ్, మన్ప్రీత్ గోనీ, సుదీప్ త్యాగీ, మోహిత్ శర్మ మొదలుకొని తాజాగా దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ వరకు చాలామంది కొత్త కుర్రాళ్ల టాలెంట్కు సానబెట్టి వాళ్లు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇండియాకు రిప్రజెంట్ చేసేలా చేశాడు ధోనీ. వేరే జట్ల తరఫున అంతంత మాత్రంగా ఆడిన కేదార్ జాదవ్, అంబటి రాయుడు, అజింక్య రహానే లాంటి ఆటగాళ్లు ధోనీ కెప్టెన్సీలోకి వచ్చాక బ్రహ్మాండంగా రాణించి మళ్లీ టీమిండియాలోకి రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాం.
ధోనీ కెప్టెన్సీ టెక్నిక్స్ సింపుల్ గా ఉంటాయి. తాను నమ్మి ఎలెవెన్లో ఆడించిన ఆటగాళ్లు వరసగా ఫెయిలైనా వాళ్లను తీసేయడు. కెప్టెన్ తమ మీద ఉంచిన నమ్మకాన్ని వాళ్లు కూడా వమ్ము చేయకుండా ఏదో ఒక దశలో ఫామ్ లోకి రావడం తరుచుగా చూస్తూనే ఉంటాం. జట్టు ఎంపికలో కూడా సూపర్ స్టార్ల కోసం వెళ్లకుండా ఎక్కువగా సీనియర్ల అనుభవానికి పెద్ద పీట వేస్తాడు ధోనీ. ఇక ధోనీ కూల్ కెప్టెన్సీ గురించి, వ్యూహ రచన గురించి కొత్తగ చెప్పాల్సిన పని లేదు. అలాగే ఫినిషర్గా అతను తన బ్యాటింగ్తో అందించే కొసమెరుపులు కూడా మనకు తెలిసినవే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ విజయాలకు పూర్తి క్రెడిట్ ధోనీకే ఇవ్వడం కరెక్టు కాదు. ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి. టీంను నడిపించడంలో ధోనీకి పూర్తి స్వాతంత్రం ఇచ్చిన ఫ్రాంచైజ్ యజమాన్యాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ముంబై, చెన్నై ఇన్ని టైటిల్స్ గెలవడానికి ఆ రెండు జట్ల యజమాన్యం ఏర్పరిచిన ఆరోగ్యకరమైన వాతావరణం కూడా కారణమని దగ్గరనుంచి చూసిన వారు చెబుతుంటారు.
మరే జట్టుకు లేనట్టుగా చెపాక్ స్టేడియంలో 71 శాతం విజయాలు సీఎస్కే సాధించింది. 2011 సీజన్లో అయితే చెన్నైలో ఆడిన ఏడుకు ఏడు మ్యాచ్లు ఈ జట్టు నెగ్గి రికార్డు సృష్టించింది. ఫ్రాంచైజ్ యజమానులు బెట్టింగ్కు పాల్పడ్డారని సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు ఐపీఎల్ నుంచి సస్పెండ్ ఆయ్యాయి. సుప్రీం కోర్ట్ నియమించిన లోధా కమిషన్ ఈ సస్పెన్షన్ విధించింది. 2016, 2017 సీజన్లలో ఈ రెండు జట్లు ఐపీఎల్కు దూరంగా ఉన్నాయి. అయితే 2018లో తిరిగి వస్తూనే చెన్నై జట్టు ఆ ఏడాది టైటిల్ గెలుచుకుని తన సత్తా చాటింది. ఆ తర్వాత 2020 సీజన్ లో లీగ్ దశలో ఇంటిబాట పట్టింది. మళ్లీ పుంజుకుని 2021 సీజన్ లో ధోనీ కప్పును ఎగురేసుకుపోయింది. మళ్లీ 2022లో ధోనీ అండ్ కో ఫెయిల్ అంది. లీగ్ నుంచి ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఇంటికెళ్లాల్సి వచ్చింది. తాజాగా ఈ సీజన్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ తో మిస్టర్ కూల్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
HHVM vs PS 2: పవన్ అంటే మణిరత్నంకి ఎందుకంత కోపం?