
WASIM AKRAM : 2023 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. ఆఫ్గనిస్తాన్ పై పాక్ ఓడిపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా మండిపడుతున్నారు. పాకిస్తాన్ ఒకప్పటి ఫాస్ట్ బౌలర్, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ అయితే నాలుగు అడుగులు ముందుకేసి మీకు తిండి దండగ అన్నట్టు మాట్లాడాడు. రోజుకి 8 కిలోలు మాంసం తింటారు కదా.. అని అంటూనే, తిండికి ముందుంటారు, ఆటకి వెనక ఉంటారని ముఖం మీదే కొట్టినట్టు మాట్లాడాడు.
ఒకనాడు వరల్డ్ కప్ కొట్టిన పాకిస్తాన్ జట్టులో హేమాహేమీలు ఉండేవారు. ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, మియాందాద్, రమీజ్ రాజా, సలీం మాలిక్, ఇంజమామ్ ఉల్ హక్ ఇలా వీరందరి సరసన ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ కూడా ఒకరిగా ఉండేవాడు. ముఖ్యం వసీం అక్రమ్ బౌలింగ్ లో ఆడటం అంటే బ్యాటర్లు కొద్దిగా భయపడేవారు. అయితే క్రికెట్ కి దూరమైన తర్వాత జెంటిల్ మేన్ గా ఉండే అతి తక్కువ క్రికెటర్లలో తను ఒకడిగా పేరుపొందాడు.
ఆటలో గెలుపు ఓటములు సహజం. ఆయన కూడా ఇలాంటివెన్నో చూశాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఇండియా మీద పాక్ జట్టు గెలవలేదు. నాడు 1992లో పాక్ వరల్డ్ కప్ గెలిచిన జట్టుపై కూడా ఇండియా గెలిచింది. అందువల్ల ఓటమిలో ఉన్నప్పుడు మాజీ క్రికెటర్లు అతి తక్కువగా స్పందిస్తుంటారు. కానీ ఎప్పుడూ కామెంట్ చేయని వసీం అక్రమ్ ఈసారి ఆఫ్గాన్ తో ఓటమి తర్వాత మాట్లాడేసరికి అంతా షాక్ అయ్యారు. అంతేకాదు తను వారిని తిట్టిన తిట్లు కూడా మామూలుగా లేవు.
రోజుకి 8కేజీల మాంసం తింటారు కదా.. సిగ్గులేదా? అన్నట్టు మాట్లాడారు. అంతేకాదు తిండికి ముందుంటారు. ఆటలో మాత్రం వెనుక ఉంటారని ఆక్షేపించాడు. అయితే పాకిస్తాన్ జట్టుని తిట్టవచ్చుగానీ, మరీ ఇంత ఇదిగా అనకుండా ఉండి ఉంటే బాగుండేదని కొందరు అక్రమ్ కి సూచిస్తున్నారు. ఇలాంటి మాటలు అనడం వల్ల అక్రమ్ వ్యక్తిత్వం దెబ్బతింటుందని చెబుతున్నారు. వసీం అక్రమ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఎంతో గౌరవం ఉంది. దానిని నిలబెట్టుకోమని సూచిస్తున్నారు.
ఏ కెప్టెన్ అయినా, ఏ టీమ్ లీడర్ అయినా, ఏ సంస్థలోనైనా, ఆటాడే గ్రౌండ్ లో అయినా తనకిచ్చిన టీమ్ తోనే ఎవరైనా ముందుకి వెళతారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అయినా అంతే కదా. తనకి మేనేజ్ మెంట్ ఇచ్చిన టీమ్ తోనే క్రికెట్ ఆడాలని చెబుతున్నారు. ఇది ఒక్క పాక్ జట్టు వైఫల్యం మాత్రమే కాదు. టీమ్ మేనేజ్మెంట్ ది కూడా అని చెబుతున్నారు.
అయితే దురదృష్టం ఏమిటంటే వరల్డ్ కప్ ప్రారంభంలోనే ఇండియాపై ఆడటం, అందులో ఓడిపోవడంతో వారి మానసిక స్థైయిర్యం దెబ్బతింది అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనే పాక్ విజృంభించి సెమీస్ వరకు వెళ్లిన ఘటనలు చాలానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇదే వరల్డ్ కప్ మెగా టోర్నీలో 1979, 1983, 1987 & 2011లో సెమీస్ వరకు పాక్ వెళ్లింది. 1996 , 2015లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లిందని అంటున్నారు.
వసీం అక్రమ్ ఏదో అనేశాడు గానీ.. 1992 లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్తాన్ అలవోకగా ఏమీ గెలవలేదు. ఎన్నో అదృష్టాలు కలిసి వచ్చాయి. అది అక్రమ్ కి గుర్తుండే ఉంటుంది. నాడు గ్రూప్ దశలో ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 72 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ సులువుగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో వర్షం వచ్చింది. నిబంధనల ప్రకారం 10 ఓవర్లలో ఇంగ్లండ్ 62 పరుగులు చేయాలన్నారు. సరే అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించే సరికి మళ్లీ వర్షం వచ్చింది. దాంతో రెండు జట్లకి చెరో పాయింట్ కేటాయించారు. దీంతో పాకిస్తాన్ సెమీస్ చేరింది. అటు నుంచి ఫైనల్ కి వెళ్లింది. ఇదే ఇంగ్లండ్ తో ఫైనల్ లో ఆడి కప్ ఎగరేసుకుపోయింది.
నిజంగా ఆరోజు వర్షం పడి ఉండకపోతే పాక్ ఓడిపోయి, గ్రూప్ దశలోనే వెనక్కి వచ్చేసేది. 8 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా సెమీస్ కి వెళ్లేది. అప్పటికి టాప్ 4లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ ఉన్నాయి. అయితే పాక్, 5వ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియా చెరో 8 పాయింట్లతో ఉన్నాయి. అప్పటికి రన్ రేట్ ప్రకారం పాక్ 4వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తో అలా ఘోరంగా ఓడిపోయి ఉంటే రన్ రేట్ పడిపోయేది. ఆటోమేటిక్ గా అదే పాయింట్లతో ఆస్ట్రేలియా సెమీస్ కి వెళ్లేది. ఆ వర్షం వల్ల మ్యాచ్ టై కావడం తో 8 పాయింట్లకి 1 కలిసి 9 అయ్యింది. టాప్ ఫోర్ లోకి వెళ్లిపోయింది.
మరీ ఆనాటి వరల్డ్ కప్ అదృష్టం వల్ల వచ్చిందా, వీరి శక్తి సామర్థ్యాల మీద వచ్చిందో వసీం అక్రమ్ లాంటి సీనియర్లు గమనించాలని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఒకరిని వేలెత్తి చూపించేటప్పుడు మన వెనుక పది ఉంటాయని గుర్తు చేసుకోవాలని అంటున్నారు.