PJTSAU Convocation: తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లలకి యూజీ కోర్సుల్లో 15 శాతం సీట్లు ప్రత్యేకంగా కేటాయించామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంతో 1200 గ్రామాల్లోకి వెళ్లి లక్షా 20 వేలమంది రైతులని నేరుగా కలిశామని వివరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో మెగా స్నాతకోత్సవం నిర్వహించారు. 2135 మంది అండర్ గ్రాడ్యూయేట్స్ కి, 480 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్ కి, 129 మందికి పీ హెచ్ డీ పట్టాలు అందచేశారు. ఆరుగురు పీ హెచ్ డీ అభ్యర్థులకు, 26 మంది పోస్ట్ గ్రాడ్యూయేట్స్ కు, 64 మంది అండర్ గ్రాడ్యూయేట్స్కు బంగారు పతకాలు అందజేశారు. అంతర్జాతీయ వ్యవసాయ రంగ నిపుణుడు డాక్టర్ ప్రభు పింగళికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన, పరిశోధన, విస్తరణ అంశాలలో విశ్వవిద్యాలయం అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుందని తెలిపారు. ప్రత్యేక కోటా సీట్ల ఫీజును 10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గించినట్లు తెలిపారు. నూతనంగా కొడంగల్, నిజామాబాద్, హుజూర్ నగర్లలో వ్యవసాయ కళాశాలలని ప్రారంభించామన్నారు. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ సహా అనేక అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. ఈ అన్ని చర్యలతో విశ్వవిద్యాలయం ర్యాంక్ 37 నుంచి 24 కు పెరిగిందన్నారు. ఐకార్, రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర సహకారంతో విశ్వవిద్యాలయాన్ని అత్యున్నత స్థానానికి తీసుకుని వెళ్ళడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
Also Read: Actress Amardeep: ఇంత వయసు వచ్చిన అది చెయ్యకుండా ఉండడు..అమర్ పై తల్లి కామెంట్స్..
టాటా – కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రభు ఎల్ పింగళి మాట్లాడుతూ 1960లలో ఆహార కొరత ఎదుర్కొన్న భారత్ హరిత విప్లవంతో నేడు ఆహార ఉత్పత్తులని ఎగుమతి చేసే స్థాయి కి ఎదిగిందని వివరించారు. పప్పు దాన్యాలు, తృణ దాన్యాల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామన్నారు. కోవిడ్ తర్వాత డిజిటలీకరణతో వివిధ యాప్ల ద్వారా ఇంటి వద్దకే ఆహార పదార్ధాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. సాగు పద్ధతులు, పంటల సరళి, విధానాలు మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదునాతన టెక్నాలజీలు, డిజిటల్ విధానాలని, విస్తరణ సేవలని సన్న, చిన్నకారు రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. పంటల వైవిధ్యకీరణకి తోడ్పడే విధంగా వ్యవసాయ విధానాలు రూపొందించాలని సూచించారు. రవాణా, మార్కెటింగ్ వ్యవస్థ, నిల్వ సదుపాయాలలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు అధికం కావాలన్నారు. వినియోగదారుల ఆహారపు అలవాట్లకి అనుగుణంగానూ, ప్రజలకి పౌష్టికాహార భద్రత అందించే విధం గానూ ప్రణాళిక లు ఉండాలని అభిప్రాయ పడ్డారు.
Also Read: JICA Loan Project: అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం