JICA Loan Project: స్వేఛ్చ బ్యూరో: జైకా సహకారంతో 5 ఏళ్లకు రూ.1270 కోట్ల విలువైన ప్రాథమిక ప్రతిపాదనలు తెలంగాణ అటవీశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ మొత్తం వ్యయంలో 85 శాతం జైకా నుంచి రుణ రూపంలో నిధులను, మిగిలిన 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని ప్రతిపాదనలో పొందుపరిచారు. రాష్ట్ర అటవీశాఖను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) నుంచి రుణ సహాయం పొందేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. హైదరాబాద్ లోని అరణ్యభవన్లో అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి డాక్టర్ సీ.సువర్ణ అధ్యక్షతన జపాన్ నుంచి వచ్చిన జైకా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో సువర్ణ తెలంగాణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. పచ్చదనం పెంపు లక్ష్యంగా వనమహోత్సవం కార్యక్రమాన్నిఅమలు చేస్తున్నామని, జైకా ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి, టైగర్ రిజర్వ్ల బలోపేతం, వన్యప్రాణి సంరక్షణ, అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్, విస్తృత ప్లాంటేషన్ కార్యక్రమాలు, క్షీణించిన అడవుల పునరుద్ధరణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ వంటి పలు కీలక కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు నిర్ణయించారు.
Also Read: BJP Rebel Candidates: కమలంలో కల్లోలం.. బీజేపీ మున్సిపల్ రెబల్స్ పై సస్పెన్షన్ వేటు..!
జైకా ప్రతినిధులు మాట్లాడుతూ భారత్–జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రస్తుతం భారత్లోని పది రాష్ట్రాల్లో అటవీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను జైకా అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ అటవీ శాఖ ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలు సమగ్రంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రశంసించారు. అటవీ సంరక్షణతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే దిశగా ఈ ప్రాజెక్టులు ఆదర్శంగా నిలుస్తాయని, తెలంగాణతో కలిసి పని చేయడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జైకా ప్రతినిధులు ఇహా చినాట్సు, షిమోజో హిటోమీ, జైకా భారతీయ ప్రతినిధి సిద్ధార్థ్ పరమేశ్వరన్, పీసీసీఎఫ్(వైల్డ్లైఫ్) వినయ్ కుమార్, పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి, సీసీఎఫ్ లు ప్రియాంక వర్గీస్, ఎస్.జె. ఆశ, క్షితిజ, డీఎఫ్ఓలు పాల్గొన్నారు.