Hydra operation: హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్న హైడ్రా (HYDRAA), తాజాగా శేరిలింగంపల్లి పరిధిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. కొండాపూర్ నుంచి మదీనాగూడ వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి అధికారులు విముక్తి చేశారు. సుమారు రూ. 700 కోట్ల బహిరంగ మార్కెట్ విలువ కలిగిన ఈ స్థలాన్ని కాపాడటం ద్వారా భూబకాసురులకు హైడ్రా గట్టి హెచ్చరికలు పంపింది.
స్థానిక జంగమోనికుంట ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ కొందరు కబ్జాదారులు అక్రమంగా నాలుగు ఎకరాల భూమిని ఆక్రమించారు. నీటి వనరుగా ఉన్న కుంటను మట్టితో పూడ్చివేసి, దానిని చదును చేసి రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేందుకు ప్రయత్నించారు. ఆ భూమిని ప్లాట్లుగా విభజించి అమాయక ప్రజలకు విక్రయించి కోట్లాది రూపాయలు గడించాలనే పక్కా స్కెచ్తో కబ్జాదారులు పనులు ముమ్మరం చేశారు.
ఈ అక్రమాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో హైడ్రా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అధికారులు, రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన కుంట స్థలమని నిర్ధారించారు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య జంగమోనికుంట పరిసరాల్లో ఆపరేషన్ నిర్వహించి, ఆక్రమణలను తొలగించారు. తిరిగి ఎవరూ లోపలికి ప్రవేశించకుండా కుంట చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు.
మరోవైపు, ఈ భూకబ్జాకు పాల్పడిన వ్యక్తులపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తిని కాజేయాలని చూసిన సదరు వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Also Read: అటవీ శాఖ అభివృద్ధికి జైకా రుణ సహాయం
హైడ్రా తీసుకున్న ఈ సాహసోపేతమైన చర్యపై నగరవాసుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని నీటి వనరులను కలుషితం చేస్తున్న, మాయం చేస్తున్న కబ్జాదారుల భరతం పట్టడంలో హైడ్రా తన దూకుడును కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా కోట్ల విలువైన ప్రజా ఆస్తి సురక్షితం కావడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా పెద్దపీట వేసినట్లయింది.
రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
కొండాపూర్-శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం- మదీనాగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్
స్థానిక జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని ఆక్రమించిన కబ్జాదారులు
మట్టి పోసి ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధం
ఈ మేరకు కబ్జాదారులపై కేసు నమోదు… pic.twitter.com/L3fYatyBQP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 10, 2026