Adulterated Tea: టీ పొడిని కల్తీ చేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటాలాడుతున్న వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 120 కిలోల కల్తీ టీ పొడితోపాటు దాని కోసం ఉపయోగిస్తున్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫతేనగర్ నివాసి జగన్నాథ్ బిష్ణోయ్ (33) టీ పొడి వ్యాపారి. న్యాయంగా చేసే వ్యాపారంలో వస్తున్న లాభాలతో సంతృప్తి చెందని జగన్నాథ్ తేలికగా డబ్బు సంపాదించేందుకు కల్తీ దందా మొదలు పెట్టాడు. ఈ క్రమంలో కొబ్బరి పీచు పొడిని పెద్ద మొత్తంలో కొని ముందుగా దాంట్లోని వ్యర్థాలను తొలగించేవాడు. ఆ తరువాత పొడిని బెల్లం నీటితో కలిపి రెండు మూడు రోజులపాటు ఎండబెట్టేవాడు.
Also Read: Suspense thriller OTT: అమ్మాయిలకు నరకం చూపించే జైలు… ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠభరితమే
అనంతరం సన్ సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ ఆరెంజ్ అనే సింథటిక్ రసాయనాలను రంగు కోసం కలిపేవాడు. ఇలా కలిపిన మిశ్రమాన్ని మరోసారి ఎండబెట్టి అమ్ముతున్నాడు. ఈ మేరకు పక్కగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ యదేంధర్, ఎస్ఐ రవిరాజ్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితున్ని అరెస్ట్ చేశారు. విచారణలో టీ పొడిని కల్తీ చేయటానికి నిందితుడు 450 గ్రాముల నాణ్యత లేని టీ డస్ట్, 500 గ్రాముల నాణ్యత లేని టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కొబ్బరి పీచు పొడిని కలుపుతూ వస్తున్నట్టుగా వెల్లడైంది. దీనిని స్థానికంగా నడుస్తున్న టీ స్టాళ్లతోపాటు డీలర్లకు విక్రయిస్తున్నట్టుగా తేలింది. నిందితుని నుంచి 120 కిలోల కల్తీ టీ పొడి, 138 కిలోల కొబ్బరి పీచు పొడి, 800 గ్రాముల సన్ సెట్ ఎల్లో కలర్, 700గ్రాముల టార్ట్రాజైన్ ఆరెంజ్ కలర్ తోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Tollywood Market: తమిళ వాళ్లకు టాలీవుడ్ మీరీ అంత చులకనగా కనిపిస్తుందా?.. అసలు ఏం చేశారంటే?