Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: అంబర్ పేట.. బీజేపీకి కంచుకోట అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంబర్ పేటలో ఆదివారం నిర్వహించిన బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. 2004లో అంబర్పేట్ ప్రజలు తనను గెలిపించి బీజేపీ నుంచి కాషాయ జెండాను ఎగురవేసిన ఏకైక ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందని వివరించారు.
హృదయపూర్వక ధన్యవాదాలు
పార్టీకి తలెత్తుకుని నిలబడే అవకాశం కల్పించింది అంబర్పేట్ ప్రజలేవనని, అందుకు అంబర్పేట్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలని వివరించారు. అంబర్పేట్ ప్రజలు తనను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించి పార్టీకి గౌరవం తీసుకొచ్చారన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడటంలో అంబర్పేట్ కార్యకర్తలు, ప్రజల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. అంబర్పేట్ ఎప్పటి నుంచో బీజేపీకి బలమైన కోటగా నిలిచిందన్నారు.
Also Read: YSRCP అధికారిక ఫేస్బుక్ పేజీ తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!
అంబర్ పేట్లో అభివృద్ధి పనులు
ఈ ప్రాంతంలో గతంలో నీటి సమస్యలు ఎక్కువగా ఉండేవని, కానీ ప్రజల సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అంబర్పేట్లో 21 ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మించి, స్మార్ట్ క్లాసులు ఏర్పాటు చేశామని వివరించారు. వందకు పైగా కమ్యూనిటీ హాల్స్, ఆధునిక బీసీ హాస్టల్ నిర్మించామన్నారు. 3 దోబీ ఘాట్లు అభివృద్ధి చేసి, రూ.360 కోట్లతో 5 విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనేక పార్కులు అభివృద్ధి చేసి, రూ.400 కోట్లతో అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మించినట్లు చెప్పారు. లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖానాల అభివృద్ధికి కృషి చేశామన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు
పేదల కోసం హౌసింగ్ స్కీమ్స్ అమలు చేశామని, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణాన్ని కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చెత్తకుప్పలు, మట్టికుప్పలు తొలగించడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలైన బీసీ, దళిత, మహిళలు, నిరుద్యోగులు, రైతులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు కాలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: అవసరమైతే నేనూ రోడ్డు మీదికి వస్తా.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!