Meerpet Accident: స్వేచ్ఛ బ్యూరో: మీర్ పేట్ లో ఆదివారం జీహెచ్ ఎంసి చెత్త లారీ భీభత్సం సృష్టించింది. పరిమితికి మించిన వేగంతో లారీ నడిపిన డ్రైవర్ రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరు ఆటో డ్రైవర్లను ఢీ కొట్టాడు. ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా మరో ఆటో డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
గుర్రం గూడ ఆదిత్యనగర్ కు చెందిన సభావత్ సునీల్ (35) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఆదివారం తెల్లవారుఝాము 2గంటల సమయంలో ఇంటికి వస్తుండగా ఆటో మందమల్లమ్మ చౌరస్తాలో మొరాయించింది. దాంతో సునీల్ తన స్నేహితుడైన గుర్రం గూడ అరవింద్ నగర్ కాలనీకి చెందిన సభావతి ప్రసాద్ (26) ను టోయింగ్ కోసం ఆటో తీసుకుని రమ్మనమని ఫోన్ చేశాడు. దీంతో ప్రసాద్ తన ఆటోను తీసుకుని మందమల్లమ్మ చౌరస్తా ప్రాంతానికి వచ్చాడు. ప్రసాద్ ఆటోకు సునీల్ ఆటోను తాడుతో కట్టారు.
Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.. అంబర్పేట వేదికగా కిషన్ రెడ్డి ధ్వజం!
బయల్దేరటానికి సిద్ధం అవుతుండగా ప్రసాద్ ను కలవటానికి నందనవనం ప్రాంతానికి చెందిన చెందిన మరో ఆటో డ్రైవర్ సంతోష్ అక్కడికి వచ్చాడు. సునీల్ ఆటో వద్ద నిలబడి ఉండగా ప్రసాద్ రోడ్డు దాటుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఎల్బీనగర్ నుంచి మందమల్లమ్మ వైపు వేగంగా దూసుకొచ్చిన చెత్త టిప్పర్ ఆటోల వద్ద నిలుచున్న సునీల్ , సంతోష్ లను ఢీకొట్టింది. ఈ ఘటనలో సంతోష్ తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు.
సునీల్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం హస్తినా పురంలోని ఆగస్త్య ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సునీల్ పరిస్థితి విషమించి కాసేపటికే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ జవాల సురేష్ (38)గా పోలీసులు గుర్తించారు. కేసును మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: YSRCP అధికారిక ఫేస్బుక్ పేజీ తొలగింపు.. చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం!