Amberpet Suicide: అంబర్పేటలో సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ విషాద ఘటనకు సంబంధించి సికింద్రాబాద్ డీసీపీ రక్షిత మూర్తి ప్రెస్ మీట్ సమావేశంలో కీలక అంశాలు వెల్లడించారు.
హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల ఫిబ్రవరి 24న రామ్ రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ తమ నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మృతులు బిర్యానీ హోటల్ వ్యాపారం నిర్వహించేవారు. వ్యాపార విస్తరణ కోసం వీరు పలువురి వద్ద సుమారు రూ. 57 లక్షలు వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. అయితే.. తీసుకున్న అప్పుకు సంబంధించి భారీగా వడ్డీ చెల్లించాలని, అసలు మొత్తం వెంటనే తీర్చాలంటూ అప్పు ఇచ్చిన వారు తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. ఈ వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన కుటుంబ సభ్యులు సామూహికంగా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితులను మానసికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నిర్ధారించిన పోలీసులు.. తాజాగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మహమ్మద్ వాసి జమాన్, రాజశేఖర్ రెడ్డి, నవాజ్, మాజీబ్ హైదర్ లుగా గుర్తించి రిమాండ్కు తరలించారు. వీరి వేధింపుల వల్లే ఒక నిండు కుటుంబం బలి కావాల్సి వచ్చిందని డీసీపీ స్పష్టం చేశారు.
నిందితుల అరెస్ట్ సందర్భంగా వారి వద్ద నుండి పోలీసులు భారీగా ఆధారాలను సేకరించారు. బాధితుల నుండి బలవంతంగా సంతకాలు చేయించుకున్న ఖాళీ ప్రామిసరీ నోట్లు, బ్యాంక్ చెక్కులు, మొబైల్ ఫోన్లతో పాటు ఎంఓయూ (MoU)లు, మార్టిగేజ్ లోన్ అగ్రిమెంట్లు, భూ పత్రాలు , బాండ్ పేపర్లను సీజ్ చేశారు. అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి, సామాన్యులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.