Auto driver Mohammed Zaheer: నగరంలో నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని ఒక సామాన్య ఆటో డ్రైవర్ నిరూపించారు. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా అడ్డుకున్నారు మహమ్మద్ జాహెర్. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ఆ అజ్ఞాత వీరుడు ప్రదర్శించిన ధైర్యానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ ఫిదా అయ్యారు. సోమవారం బంజారాహిల్స్లోని తన కార్యాలయంలో జాహెర్ను ప్రత్యేకంగా సన్మానించి నగదు పురస్కారం.. ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీమతి మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే.. డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో.. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని తన ఆటో సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.
సంఘటన స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్లినప్పటికీ.. జాహెర్ వెనువెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో బలంగా ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు అక్కడికి చేరుకుని రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నారు. తన పని ముగిసిన తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్ను సేకరించి.. సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ను గుర్తించారు. నిందితుడు మహ్మద్ సోహేల్పై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గోల్కొండ జోన్ డీసీపీ జి. చంద్ర మోహన్.. గోషామహల్ ఎస్హెచ్వో శ్రవణ్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ సన్మానంలో జాహెర్ చూపిన తెగువను అధికారులు కొనియాడారు.
సీపీ వీసీ సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో.. ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు” అని ప్రశంసించారు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుందని.. నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు పిలుపునిచ్చారు.
✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం
✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేత
నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026
Read Also: రామోజి ఫిల్మ్ సిటీ దగ్గర ఇసుక డాన్ అరెస్ట్.. ఏపీ నుంచి తెలంగాణ ఖజానాకు కన్నం..?