Bhatti Vikramarka: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కకు డల్లాస్ నగరంలో ఘన స్వాగతం లభించింది. బాల్టిమోర్లో గత మూడు రోజులుగా ఎంతో వేడుకగా జరిగిన ‘ఆట’ మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన అక్కడ నుంచి డల్లాస్ చేరుకున్నారు.
ఐఓసీ, టీపీసీసీ ఆత్మీయ స్వాగతం
డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన డిప్యూటీ సీఎంకు ఎన్ఆర్ఐ టీపీసీసీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు, నాయకులు ఆత్మీయంగా ఎదురేగి పుష్పగుచ్ఛాలతో సాదర స్వాగతం పలికారు. ప్రవాస భారతీయులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్టుకు తరలివచ్చి తమ అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. తమ సొంత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాకతో స్థానిక ఎన్ఆర్ఐ వర్గాల్లో పండుగ వాతావరణం, తీవ్ర ఉత్సాహం నెలకొంది.
‘క్రిటికల్ మినరల్స్’పై రెండు రోజుల పాటు కీలక భేటీలు
డల్లాస్ నగరంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా.. సింగరేణి ఉన్నతాధికారుల బృందంతో కలిసి ‘క్రిటికల్ మినరల్స్’ అంశంపై వివిధ బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. నూతన సాంకేతికతను రాష్ట్రానికి తీసుకురావడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భేటీలు సాగనున్నాయి.
స్వాగతం పలికిన ప్రముఖులు
విమానాశ్రయంలో డిప్యూటీ సీఎంకు స్వాగతం పలికిన వారిలో నెహ్రూ కొమ్మినేని, అచ్యుత్ తుమ్మల, మధు ఇరుగు, వసంత్ బొబ్బల, రాజ్ బెజ్జల, హరినాథ్ శీలం, వడ్డే రాజేష్, ప్రమోద్ రెడ్డి, రిషిత్ సలవాది, రేవంత్ రెడ్డి, దుష్యంత్ బొక్క, సందీప్ తదితర ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఉన్నారు.
Also Read: సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!