Dharmapuri Arvind: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలు విద్యార్థులు , వారి తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాల్సిన ముఖ్యమంత్రే విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యాశాఖకు సరైన నాయకత్వం కరువు
విద్యాశాఖ పట్ల ఏమాత్రం అవగాహన, చిత్తశుద్ధి లేని వ్యక్తి ఆ శాఖ బాధ్యతలను నిర్వహించడం ఏమాత్రం సరికాదని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా విద్యాశాఖ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే వ్యవస్థ కొంతైనా బాగుపడుతుందని సూచించారు. ‘ఎవరి సహకారం తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు నింపగలరా?’ అని సవాలు విసిరిన ఆయన, భౌగోళిక అంశాలపై సీఎం అవగాహనారాహిత్యాన్ని ఎండగట్టారు. ‘తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉందని ఒకసారి, సముద్రమే లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మరోసారి అనడమే ఆయనకున్న గొప్ప ప్రతిభ’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పాఠశాలల దుస్థితిపై తీవ్ర విమర్శలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కనీస మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతున్నాయని అరవింద్ ఆరోపించారు. స్కూళ్లలో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, విద్యార్థులకు కనీస మరుగుదొడ్ల వసతి కూడా లేని దారుణ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కనీసం ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా సందర్శించారా అని ప్రశ్నించారు. ఉన్న పాఠశాలలను బాగుచేయడం వదిలేసి, కేవలం కమిషన్లు దండుకోవడానికే కొత్త స్కూళ్ల నిర్మాణాల పేరిట హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Also Read: నన్ను వాడుకుని వదిలేశారు.. వైఎస్ జగన్ నివాసం వద్ద బోరగడ్డ అనిల్ హల్చల్!