Bandi Sanjay: కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ మెుదలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. అసెంబ్లీలో మాట్లాడే దగ్గర ఈ పోటీ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మరోవైపు కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒక్కటేనన్న బండి.. రెండు పార్టీలు ప్రజా సమస్యపై మాట్లాడే అర్హతను కోల్పోయాయని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు డ్రామా ఆర్టిస్టులుగా ప్రవర్తిస్తుంటే.. కాంగ్రెస్ వారిని ఆడించేదిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులపై ఎందుకు విచారణ జరపడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. రెండు పార్టీల వైఖరితో ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ శాసనసభ్యులకి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ.. మరో బంగ్లాదేశ్, శ్రీలంక లాగ మారబోతోందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీది ఢిల్లీలో ఒక విధానం ఇక్కడో విధానంలా కనిపిస్తోందని బండి సంజయ్ అన్నారు. పార్లమెంటుకు రాహుల్ గాంధీ నల్ల టీషర్ట్ ధరించి వచ్చారని.. మోదీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు. కానీ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రభుత్వం సరిగా నడవట్లేదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Also Read: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వాట్సాప్ ఛానెల్ ప్రారంభం.. ఒక్క క్లిక్తో అప్డేట్స్!
మరోవైపు మోదీ 25 ఏళ్ల ప్రజాపాలన నేపథ్యంలో సెప్టెంబర్ 17న ఆశీర్వాద దీపం పేరుతో దేశవ్యాప్తంగా దీపం వెలిగిస్తామని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు, మండలాలలో అశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్కీం లబ్దిదారులు అందరూ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అటు సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండు ప్రత్యేక సభ నిర్వహిస్తామని.. దీనికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి పాల్గొంటారని చెప్పుకొచ్చారు.
Also Read: 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!