SC ST Welfare: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికే ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, విద్యారంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి వెనుకాడబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద, బహుజన వర్గాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమక్షానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. సంక్షేమ పథకాల అమలు, గురుకులాల నిర్వహణ, విద్యా మౌలిక వసతులు, స్వయం ఉపాధి, స్కాలర్షిప్లు, స్టడీ సర్కిళ్లు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
గత పాలనపై విమర్శలు..
గత పదేళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేసిందని, సంక్షేమ శాఖల కార్పొరేషన్ల ద్వారా యువతకు అవసరమైన ప్రోత్సాహకాలు అందించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, రాజీవ్ యువ వికాసం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పారు. నవంబర్ 19 నుంచి లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్ల కోసం తొలి విడతగా రూ.లక్ష వరకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 19న రాజీవ్ యువ వికాసం యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, రూ.లక్షలోపు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో యూనిట్లు మంజూరు చేయాలని సూచించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను కార్యాలయాల్లోనే స్వీకరించాలని, ఎంపిక ప్రక్రియను కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
గురుకులాల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలలు..
రెసిడెన్షియల్ పాఠశాలల కోసం కేంద్రీకృత యంత్రాల వంటశాలలు ఏర్పాటు చేసే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలోని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిత్యం శుభ్రమైన, నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలలు ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆధునిక వంటశాలల నిర్వహణ, యంత్రాల కొనుగోలు కోసం బడ్జెట్లో ఇప్పటికే రూ. 25 కోట్లను కేటాయించినట్లు గుర్తుచేశారు. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు..
రాబోయే 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మెకనైజ్డ్ కిచెన్ల ఏర్పాటు ఏ విధంగా పూర్తి చేస్తారనే దానిపై పక్కా కార్యాచరణ, స్పష్టమైన ప్రణాళికతో తమ ముందుకు రావాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో ఆధునిక వంటశాలల నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు విద్యార్థుల భోజన వసతికి ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. అప్పటివరకు విద్యార్థులందరికీ నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత బ్రేక్ ఫాస్ట్ పథకం అమలుకు వాడుతున్న కేంద్రీకృత యంత్రాల వంటశాలల నమూనాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఆ స్కూల్ విద్యార్ధుల డేటా సేకరణ..
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్, రాష్ట్రంలోని వివిధ నివాస, సంక్షేమ విద్యాసంస్థల్లో పదేళ్ల నుండి చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమగ్ర డేటాబేస్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత దశాబ్ద కాలంగా ఈ పాఠశాలల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల సామాజిక,ఆర్థిక స్థితిగతులపై ఒక సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్య పూర్తి చేసుకున్న అనంతరం విద్యార్థులు ఉన్నత చదువుల్లో స్థిరపడ్డారా? ప్రతిష్టాత్మక ఉద్యోగాలు సాధించారా? లేక ఆర్థిక, సామాజిక కారణాల వల్ల మధ్యలోనే చదువును ఆపేసి డ్రాపౌట్స్గా మిగిలిపోయారా? ఈ విద్యాసంస్థలు అందించిన విద్య, వసతుల ద్వారా విద్యార్థుల జీవితాల్లో వచ్చిన మార్పులను అంచనా వేయడానికి “సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్” తో అధ్యయనం చేయించి డిటైల్డ్ రిపోర్టు తయారు చేయించాలని తెలిపారు.
సాధించిన ఫలితాలపై ఆరా..
ఎస్సీ స్టడీ సర్కిళ్లపై చేసిన వ్యయం, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య, వారికి అందించిన శిక్షణ, సాధించిన ఫలితాలపై ఆరా తీశారు. స్టడీ సర్కిళ్ల ద్వారా వస్తున్న ఫలితాలు, పెట్టుబడికి అనుగుణంగా వస్తున్న ప్రయోజనాలపై వివరణాత్మక అంచనా నివేదికను సమర్పించాలని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా నాణ్యమైన కోచింగ్ అందించాలని సూచించారు.సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 30 డిగ్రీ కళాశాలల్లో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టే అంశాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆయా కోర్సులను స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో 26 ఏకలవ్య పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందించేలా పాఠశాలల నిర్మాణం, మౌలిక వసతులపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ సెక్రెటరి విజయేంద్రబోయి, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రెటరి సంతోష్ , ఎస్సీ కార్పోరేషన్ వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.
Also Read: ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!