Bandi Sanjay Hot Comments on KTR and KCR: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువగా అధికారం చెలాయించారని, కేసీఆర్ కంటే కేటీఆరే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి చేశారని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో నేతన్నల దుస్థితికి కేసీఆర్, కేటీఆరే కారణమన్నారు. వారి హయంలో నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారన్నారు. నేతన్నలకు 50 శాతం విద్యుత్ రాయితీ ఇస్తామని ఇయ్యకుండా మోసగించారన్నారు. అసలు ఇక్కడ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదంటూ ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ప్రజల సమస్యలు పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగానే ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు.
ఇదిలా ఉంటే.. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వేములవాడకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బండి సంజయ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా ఇటీవల సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల ప్రజలు తనకు పునర్జన్మనిచ్చారన్నారు. గత పదేళ్లలో సిరిసిల్లను అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలిగామన్నారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
Also Read: నేను అవినీతి చేయలేదు.. నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైలులో ఉంది: ఎంపీ అర్వింద్
కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్, బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తుండడంతో అక్కడ పోటీ కీలకంగా మారింది. మూడు పార్టీలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభ్యర్థుల తరఫున పార్టీకి చెందిన అగ్రనేతలు కరీంనగర్ లో ప్రచారం చేస్తున్నారు. ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొని తమ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడా చూసినా ప్రస్తుతం ఎన్నికల వాతావరణం.. నాయకులు, కార్యకర్తల హడావుడే కనిపిస్తుంది.