Big TV Effect: రైతుపై అధికారి దాడి చేసిన ఘటనను బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చిన వెంటనే, జిల్లా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. గుడిహత్నూర్ మార్కెట్ యార్డ్లో PACS సెక్రటరీ పండరి రైతు సంద మహేష్పై.. దాడి చేసిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బిగ్ టీవీ ప్రసారం చేసిన గంటల్లోనే, ఇద్దరు PACS అధికారులపై సస్పెన్షన్ విధిస్తూ.. అదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు.
నవంబర్ 21వ తేదీ రాత్రి 9:40 గంటల సమయంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంట తూకానికి సంబంధించి సమాచారం తెలుసుకోవడానికి వచ్చిన రైతు సంద మహేష్తో.. PACS గుడిహత్నూర్ సెక్రటరీ పండరి వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరిగి ఆ అధికారి మహేష్పై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న కొంతమంది దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఆ తీరును చూసి రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజ్ను బిగ్ టీవీ సంపాదించింది. రైతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దాడి సన్నివేశం స్పష్టంగా కనబడే వీడియోను బిగ్ టీవీ ప్రసారం చేసింది. ప్రభుత్వ వ్యవస్థలో రైతులను కించపరిచే, అయిష్టంగా ప్రవర్తించే అధికారి తీరుపై వీడియో వైరల్ కావడంతో, ఈ అంశం జిల్లా స్థాయిలో చర్చనీయాంశమైంది.
వార్త ప్రాచుర్యంలోకి వచ్చిన గంటల్లోనే అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. దాడి చేసిన PACS గుడిహత్నూర్ సెక్రటరీ పండరి, అతనికి మద్దతుగా నిల్చిన మన్నూర్ PACS సెక్రటరీ వెంకటను తక్షణ సస్పెన్షన్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఇద్దరికీ ఏడు రోజులపాటు వేతనాన్ని నిలిపివేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు.
రైతులు మార్కెట్ యార్డ్లో అధికారి హింసకు గురవుతున్నారన్న వార్త బయట పడిన వెంటనే, రైతు సంఘాలు ఏకమయ్యాయి. మార్కెట్ డ్యూటీలో ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Also Read: ఘోర ప్రమాదం.. మంటల్లో దగ్ధమైన కారు.. డ్రైవర్ సజీవ దహనం
స్పందించిన జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులతో పాటు.. మొట్టమొదట వార్తను ప్రసారం చేసి, ఓ రైతుకు అండగా నిలబడిన బిగ్ టీవీకి రైతు సంద మహేష్ కృతజ్ఞతలు తెలిపాడు.