MP Laxman Comments: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. దీనిపై బీజేపీ కూడా స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ సూత్రదారులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్.
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఎంపీ లక్ష్మణ్.. అసెంబ్లీ ఎన్నికల్లో నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వచ్చిన ఆరోపణలను గుర్తు చేశారు. దుబ్బాక, మనుగోడు, హుజూరాబాద్ ఉపఎన్నికల్లోనూ ట్యాపింగ్ అంశంపై అప్పుడే చర్చ జరిగిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అసలు దోషులను వదిలిపెట్టవద్దన్నారు ఎంపీ.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫోన్ ట్యాపింగ్ చేసిందని గుర్తుచేశారు. అప్పట్లో దీనిపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశామని వెల్లడించారు ఎంపీ లక్ష్మణ్. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరుతామన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేయాలన్నారు.
ALSO READ: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్తో ఎలాంటి..?
మరోవైపు కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. ఎన్నికలు వచ్చినప్పుడే పరస్పరం విమర్శలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తామే గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేశారని దుయ్యబట్టారు లక్ష్మణ్. విచారణ సంస్థలు ఆమెని అరెస్ట్ చేశాయని గుర్తు చేశారు.