CP Sajjanar: విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ను మరవొద్దని, కోర్ పోలీసింగ్ను సమర్థవంతంగా నిర్వర్తిస్తే నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సీనియర్ పోలీస్ అధికారులు, ఎస్హెచ్వోలతో సీపీ సజ్జనార్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలు-నిర్వహణ, నేరాల నియంత్రణ-దర్యాప్తు, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్-టెక్నాలజీ అడాప్షన్, మానవ వనరుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతే ధ్యేయంగా మెరుగైన పోలీసింగ్ చేయాలని సజ్జనార్ సూచించారు. ప్రతి పోలీస్ అధికారి 100 శాతం తమ బాధ్యతను నిబద్దత, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. సిబ్బందిని కేవలం ఒకే పనికి పరిమితం చేయొద్దని, అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వృత్తిని, ఉద్యోగాన్ని ప్రేమిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వివరించారు. తమ పరిధిలో జరిగే విషయాలకు ఎస్హెచ్వో పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో కొన్ని కేసుల్లో నిర్లక్ష్యం వహించినట్లు దృష్టికి వచ్చిందని, ఆయా కేసులను మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: Rangalal Kunta: రంగ లాల్ కుంటకు ‘బిడాట్’ చికిత్స.. బ్లూడ్రాప్ వాటర్స్ ఆధ్వర్యంలో చెరువు పునరుద్ధరణ
“పోలీసింగ్ జాబ్ అనేది అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుంది, వాటన్నింటిని అధిగమిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్లాలి. అన్ని కేసులను రోటిన్ గా తీసుకోవద్దు. ప్రతి చిన్న నేరాన్ని కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలి. చిన్న చిన్న నేరాలకు చెక్ పెట్టకుంటే.. భవిష్యత్లో అది పెద్ద నేరానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. ప్రతి కేసును సాంకేతికంగా అన్ని కోణాల్లో విశ్లేషణ చేయాలి” అని సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతికత ఏఐ వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ పోలీసులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందని, దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.