Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులను టోర్నాడో భయం మరోసారి వెంటాడింది. గతంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలను వణికించిన ఈ ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపింది. తాజాగా పలిమెల మండలంలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో టోర్నాడో సృష్టించిన విధ్వంసం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ టోర్నడో తరహా గాలుల ధాటికి అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి.
వివరాళ్లోకి వెళితే, ములుగు జిల్లాలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన పెనుగాలులు బీభత్సానికి పెద్ద చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. మరికొన్ని చెట్లు విరిగిపడ్డాయి. ఈ టోర్నాడో విధ్వంసం అడవిని ఆనుకుని ఉన్న సమీపంలోని పంట పొలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. పొలాల గట్ల వెంబడి, పొలాల్లో ఉన్న చెట్లను పెకిలించుకుంటూ టోర్నడో ముందుకు సాగడంతో ఆ ప్రాంతమంతా దారుణంగా మారింది.
ఉదయం తమ వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన రైతులు, అక్కడ నెలకొన్న దృశ్యాలను చూసి షాక్ కి గురయ్యారు. చెట్లు విరిగిపడి, కొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు అప్రమత్తమై, ఈ సమాచారాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు అందించారు. రైతుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ప్రస్తుతం టోర్నాడో ప్రభావిత లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
కాగా, ఈ ఘటన జిల్లా వాసులకు గత సంవత్సరం ఆగస్టు 31 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో కూడిన గాలుల కారణంగా దాదాపు 50 వేల చెట్లు నేలకొరిగాయి. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు, 15 కి.మీ పరిధిలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు నేలకూలాయి. ఇప్పుడు మళ్లీ అదే విధ్వంసం పునరావృతం కావడంతో ప్రజలు కలవరపడుతున్నారు.