Telangana BJP strategy: భాగ్యనగరంలో పాగా వేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటైన ట్రై కార్పొరేషన్ల నేపథ్యంలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేసి, నూతన ఉత్తేజంతో కొత్త కమిటీలను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రేటర్ లో చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.
పాత కమిటీతో ఆశించిన స్థాయిలో పార్టీకి మైలేజ్ రాలేదని బీజేపీ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలోనే ఇప్పటి నుంచే సీరియస్ గా వర్క్ చేస్తే మూడు కార్పొరేషన్లలో పాగా వేయొచ్చని ఆ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమ సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ ను 8 జిల్లాలుగా తెలంగాణ బీజేపీ విభజించుకుంది. వాటిలో మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ జిల్లాలతో పాటు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా, గోల్కొండ, భాగ్యనగర్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలున్నాయి.
అయితే 8 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న కమిటీలు ఆశించినంత స్థాయిలో చొచ్చుకుపోయేలా పనిచేయడంలేదని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రక్షాళన చేపట్టాల్సిందేనని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కొత్త కమిటీతో పార్టీ బలోపేతంతో పాటు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం కొత్త నాయకత్వం, కొత్త కమిటీలు తీసుకురావాలని నిర్ణయించినట్టుగా చర్చ జరుగుతోంది. కొత్త కమిటీల విషయంలో పార్టీ ఒక స్పష్టమైన నిబంధన కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
కొత్త కమిటీల్లో బాధ్యతలు తీసుకునే నేతలు, ఎన్నికల్లో టికెట్ ఆశించకూడదనే షరతు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు, పదవులు ఆశించకుండా పూర్తిగా పార్టీ సంస్థాగత అభివృద్ధిపైనే దృష్టిసారించే వారికే బాధ్యతలు అప్పగించాలనే యోచిస్తున్నట్లు సమాచారం. ట్రై కార్పొరేషన్ల ఏర్పాటుతో మారనున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసి, వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ సీనియర్ నేతలు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మూడు కార్పోరేషన్ల మేయర్ పీఠాలను గెలుపే లక్ష్యంగా వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ను చెక్ పెట్టడంపైనా కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రధానంగా నగరాన్ని కుదిపేస్తున్న హైడ్రా చర్యలు, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో లోపాలు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు వంటి అంశాలపై ప్రజాపోరాటాలు చేసేందుకు సిద్ధమవ్వాలని ప్లాన్ చేస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహరచన చేస్తోంది. కాగా మూసీ ప్రక్షాళనపై జరిగిన సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు బీజేపీ దూరంగా ఉంది. ఈ అంశంలో ఏవిధమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Also Read: TVK Chief Vijay: టార్గెట్ విజయ్? ఎన్నికల వేళ సీబీఐ విచారణ.. వెనుక ఉన్నదెవరు?
మరోవైపు తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవడం, పోలింగ్ శాతం తగ్గడంపై పార్టీ సీరియస్ అయినట్లు సమాచారం. అభ్యర్థుల గెలుపోటములపై క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ ను రాంచందర్ రావు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం తగ్గడంపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Vijay Deverakonda : కొండన్నకు కార్లంటే ఎంత ప్రేమో.. ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయంటే..?