Bomb threat: హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ప్రాంతీయ వాతావరణ కేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం సృష్టించింది. కార్యాలయంలో సుమారు 14 బాంబులు అమర్చామని, అవి మధ్యాహ్నానికల్లా పేలిపోతాయని ఆ మెయిల్లో దుండగులు పేర్కొన్నారు. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
అయితే ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో, వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా కార్యాలయంలోని సిబ్బందిని వెంటనే బయటకు పంపి, భవనం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిపుణుల బృందం అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా మెయిన్ బ్లాక్తో పాటు రికార్డు రూమ్లు, కంప్యూటర్ విభాగాల్లో సోదాలు నిర్వహించారు.
గంటల తరబడి సాగిన తనిఖీల అనంతరం, కార్యాలయంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని బాంబ్ స్క్వాడ్ స్పష్టం చేసింది. ఇదొక వదంతు (Hoax Call) అని తేలడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్ బ్లాక్ పూర్తిగా సురక్షితంగా ఉందని భద్రతా సిబ్బంది ధ్రువీకరించారు. అయితే, ఆకతాయిలు కావాలనే భయాందోళనలు సృష్టించేందుకు ఇలాంటి మెయిల్ పంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: నాన్నా.. నిన్ను చూడాలని ఉంది అంటూ.. మావోయిస్టు కుమారుడి ఆడియో వైరల్..!
ప్రస్తుతం పోలీసులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సాయంతో ఐపీ (IP) అడ్రస్ను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఇలాంటి తప్పుడు బెదిరింపులు పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
బేగంపేట వెదర్ ఆఫీస్ కి బాంబు బెదిరింపు
14 బాంబులు పెట్టాం మధ్యాహ్నం వరకు బ్లాస్ట్ అవుతాయని మెయిల్ పంపిన ఆగంతకులు
బిల్డింగ్ లో తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్
మెయిన్ బ్లాక్ లో తనిఖీ చేసి సేఫ్ అని తేల్చిన బాంబ్ స్క్వాడ్
Bomb threat to Begumpet Weather Office. Unknown… pic.twitter.com/8LILkyYFjC
— BIG TV Breaking News (@bigtvtelugu) March 6, 2026