దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రంలో అమాయక భక్తులను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న దళారుల గుట్టును పోలీసులు రట్టు చేశారు. బ్రేక్ దర్శనాలు చేయిస్తామంటూ భక్తుల వద్ద నుండి నగదు దండుకుంటున్న ఏడుగురు వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో రద్దీని సాకుగా చూపి దళారులు ఈ దోపిడీకి తెరలేపారు.
అసలేం జరిగిందంటే?
బుధవారం హనుమకొండకు చెందిన రంగారావు అనే భక్తుడు తన కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనం కోసం వేములవాడకు వచ్చారు. భీమేశ్వర ఆలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉండటాన్ని గమనించిన కొందరు దళారులు ఆయనను సంప్రదించారు. క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా, త్వరగా దర్శనం చేయిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద రూ. 300 చొప్పున వసూలు చేశారు. వీరి కదలికలపై అనుమానం వచ్చిన ఆలయ భద్రతా సిబ్బంది వెంటనే వారిని పట్టుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
నిఘా పెంచిన అధికారులు..
పట్టుబడిన వ్యక్తులను విచారించగా, క్షేత్ర పరిసరాల్లో దాదాపు పది మంది వరకు ఇలాంటి దళారులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ముఖ్యంగా భీమేశ్వర ఆలయం వద్ద కోడె మొక్కులు చెల్లించుకునే భక్తులను లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమ దందా సాగుతోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న దేవస్థానం అధికారులు.. నిందితుల ఛాయాచిత్రాలను సేకరించి, ఆలయ పరిసరాల్లో ప్రదర్శించాలని నిర్ణయించారు. తద్వారా భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు దళారుల ఆటకట్టించాలని చూస్తున్నారు.
పోలీసుల హెచ్చరిక..
ఈ ఘటనపై పట్టణ సీఐ మాట్లాడుతూ.. భక్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. టికెట్ల కోసం దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారిక కౌంటర్లను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు. ‘బ్లాక్ లో టికెట్లు అమ్మినా, త్వరగా దర్శనం చేయిస్తామని డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవు. క్షేత్ర పరిసరాల్లో నిరంతరం నిఘా ఉంటుంది’ అని ఆయన స్పష్టం చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండి, ఇలాంటి వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.