రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరో కొత్త అస్త్రం దొరికినట్టు తెలుస్తున్నది. అన్నదాతలకు మద్దతుగా మాట్లాడుతున్న గులాబీ పార్టీ తాజాగా వారు పడుతున్న కష్టాలపై ఫోకస్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం యాసంగి కోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రైతులు యూరియా కోసం షాపుల వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. యాసంగికి సమయం తక్కువ ఉండటంతో ఇప్పటి నుంచే కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే రైతులు యూరియా కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎక్కడ చూసిన కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయని ఫైర్ అవుతున్నారు.
ఇటీవల కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గత పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఎట్లుండే. అన్నదాతలకు ముందే యూరియా ఇచ్చే వాళ్లం. తమ హయాంలో ఎనాడైనా యూరియా కేంద్రాల వద్ద చెప్పులు, ఆధార్ కార్డులు, గోదాం సంచులు కనిపించయా?.. ఇప్పుడేమైంది? మళ్లీ కాంగ్రెసోళ్లు పాత రోజులను తీసుకొచ్చారు. రుణమాఫీ సమయానికి అవుతున్నదా? బోనస్ ఇస్తామన్నారు ఏమైంది ఇచ్చారా? ఇస్తే ఎంతమందికి ఇచ్చారు? అంతా గోల్మాల్ చేసిండ్రు. తీర్చలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు.. ఏమన్నడు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తం.. మళ్లీ లోన్లు తెచ్చుకోండ్రి.. ఎవ్వరూ ఇప్పుడు లోన్లు కట్టొద్దు అన్నడు.. ఆ హామీలు ఏడపోయినయ్.. యూరియా కోసం యాప్ తెస్తరట.. అది ఎలా పనిచేస్తదో రైతులకు ఎలా తెలుస్తది? ఎప్పుడు వస్తదో ఎవరికి తెలుసు’ అని పెద్దఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ హయాంలో యూరియా కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. గత సీజన్లోనూ రైతులు యూరియా కష్టాలను ఎదుర్కొన్నారని.. ప్రస్తుతం యాసంగిలోనూ యూరియా దొరక్క కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. శీతాకాల అసెంబ్లీ సెషన్స్లో యూరియా అంశంపైనా చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్నిపెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని సైతం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా చేయడం వలన అధికార పార్టీ మీద పైచేయి సాధించవచ్చని ఆ పార్టీ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తున్నది.
బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విధంగా రాష్ట్రంలో ఎటువంటి యూరియా కొరత లేదని అధికార పార్టీ చెబుతోంది. యాసంగికి సరిపడా యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉందని, క్రమంగా అందరికీ అందజేస్తామని కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు. గత సీజన్లో యూరియా సకాలంలో కేంద్రం నుంచి రాలేదని, ఆ తర్వాత రాష్ట్రం నుంచి మంత్రులు, సీఎం సైతం ప్రత్యేకంగా కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో వచ్చిందని గుర్తుచేస్తున్నారు. యాసంగిలో అన్నదాతలు ఇబ్బంది పడకుండా యూరియా సకాలంలో సరఫరా చేస్తామని, గులాబీ పార్టీ తప్పులు ఆరోపణలు ఎవరూ నమ్మొద్దని అధికార పార్టీ రైతాంగానికి విజ్ఞప్తి చేసింది.రైతులకు రుణమాఫీ పథకం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని.. బోనస్ కూడా తెలంగాణలోనే అమలవుతోందని, ఏ రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని.. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ, రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టంచేస్తున్నారు.