తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ప్రస్తుతం కొత్త మలుపు తీసుకున్నది. గులాబీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్న వారిపై వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఎందుకంటే వారు తాము పార్టీ మారలేదని.. బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పీకర్కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కడియం శ్రీహరి,దానం నాగేందర్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణ త్వరగా ముగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. పార్టీ ఫిరాయింపులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు నోటీసులు జారీ చేశారు. దానిపై స్పందించిన ఆయన తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని నిన్న ప్రకటించారు. గులాబీ పార్టీ తనను సస్పెండ్ చేసినట్టు సైతం తనకు సమాచారం రాలేదని అన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలీక తల పట్టుకున్నట్టు తెలుస్తున్నది.దానం నాగేందర్ రాజీనామా చేస్తారని మొన్నటివరకు ప్రచారం జరిగింది. తీరా మున్సిపల్ ఎన్నికల ముందు ఆయన మాట మార్చడంతో అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీ సైతం షాక్ లో ఉన్నట్టు సమాచారం.
దానం నాగేందర్ నెల కిందట సర్పంచ్ ఎన్నికల సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అని ప్రకటించారు. అంతే కాకుండా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గుర్తుపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక సైలెంట్ అయ్యారు.ఇక అనర్హత ఎమ్మెల్యే పిటిషన్లపై విచారణ సమయంలో ఆయన ఎలాగూ కాంగ్రెస్ గుర్తు మీద ఎన్నికల్లో నిలబడినందున పక్కా ఆధారాలు ఉండటంతో స్పీకర్ ఆయన మీద వేటు వేస్తారని ప్రచారం జరిగింది. దానం సైతం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందని అంతా భావించారు. బై ఎలక్షన్ వస్తే సత్తా చాటాలని గులాబీ పార్టీ భావించింది. కానీ దానం యూటర్న్ తీసుకోవడంతో ఆ పార్టీ ఆలోచనలో పడినట్టు తెలుస్తున్నది.
Liquor Scam Case: లిక్కర్ స్కామ్ కేసు.. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి హైకోర్టులో భారీ ఊరట
దానం నాగేందర్ను పార్టీ నుంచి సస్పండ్ చేయాలా? వద్దా? అని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఇటీవల పటాన్ చెరు ఎమ్మెల్యే మరల సొంతగూటికి చేరుకున్నారు. దీంతో పార్టీలో ఎమ్మెల్యే స్థానం పెరిగినట్టు అయ్యింది. మిగతా ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే వస్తారని ఆ పార్టీ భావిస్తున్నది. ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్ లో ఉన్నానని దానం ప్రకటించాక.. ఎందుకు సస్పెండ్ చేయడం.. లేదా అనర్హత వేటు పడితే మరల బై ఎలక్షన్ వస్తాయి.. అప్పుడు అభ్యర్థి కోసం వేట.. మళ్లీ డబ్బుల ఖర్చులు వీటన్నింటిపై కారు పార్టీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయన మీద చర్యలు తీసుకుంటారా? అనేది వేచిచూడాల్సిందే. కాగా, బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై తన రియాక్షన్ ఉంటుందని దానం ఇప్పటికే ప్రకటించారు.