MLA Sudheer Reddy: కారణాలు ఏమైనా కావచ్చు.. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి లాక్డౌన్లోకి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి ఆయన ఈ అవతారం వెనుక అసలు ఏం జరిగింది? ఎందుకు ఆయన దోమల తెర నెట్ ధరించాల్సి వచ్చింది? అధికార పార్టీ నేతలు ఎందుకు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
లాక్డౌన్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్రాండ్ ఇమేజ్ను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆరోపించారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. గురువారం ఉదయం ఆయన దోమల తెర దుస్తులు ధరించి అసెంబ్లీ ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని ఆ విధంగా చూసి పోలీసులు షాకయ్యారు. ఫాగింగ్ యంత్రాలతో ఆయన అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అసెంబ్లీ మార్షల్స్ ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన వద్ద దోమతెర, ఫాగింగ్ యంత్రాలు ఉండటంతో లోపలికి ససేమిరా అన్నారు. వెంటనే జోక్యం చేసుకున్న సదరు ఎమ్మెల్యే, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదన్నారు. అలాంటప్పుడు లోనికి రావొద్దనడానికి ఏమైనా కొత్త నిబంధనలు ఉన్నాయంటూ మార్షల్స్పై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోమ తెర దుస్తులు ధరించి, ఆపై అసెంబ్లీలోకి ఎంట్రీ
వారిని నెట్టుకుంటూ లోపలికి ఆయన వెళ్లారు. దోమతెర ధరించి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నగరంలో దోమల సమస్య విపరీతంగా ఉందని, పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని రుసరుసలాడారు. ప్రభుత్వం వెంటనే దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించి, నగర ప్రజలను కాపాడాలన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారుతోందన్నారు. దోమలకు భయపడి ప్రజలు నగరాన్ని విడిచి పెట్టే పరిస్థితి నెలకొందంటూ ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు దోమల నియంత్రణకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ALSO READ: కేసీఆర్ పలుకే బంగారమాయేనా?
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి దోమల తెర దుస్తులతో టీవీల్లో కనిపించడంతో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. ఉన్నట్లుండి ఆయన లాక్ డౌన్లోకి వెళ్లిపోయారంటూ చర్చించుకుంటున్నారు. మొత్తానికి సమస్యను వివరించేందుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే మంచి ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.
దోమల తెర డ్రెస్ ధరించి ప్రెస్ మీట్ పెట్టిన LB NAGAR BRS MLA సుధీర్ రెడ్డి pic.twitter.com/WBIPwyB22f
— ChotaNews App (@ChotaNewsApp) April 2, 2026