రాష్ట్రంలో జిల్లాల రద్దు అంశం రాజకీయాల్లో కాకరేపుతోంది. కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని ప్రతిపక్ష బీర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నది. ఎందుకంటే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాల రద్దు అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూస్తున్నదని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో మార్పులు చేర్పులు మాత్రమే ఉంటాయని, రద్దు చేయడం వంటిది ఉండదని అధికార పార్టీ నేతలు క్లారిటీ ఇస్తున్నా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జిల్లాల రద్దు అంశాన్ని బీఆర్ఎస్ వాడుకోవాలని చూస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పొందేందుకు గులాబీ పార్టీ జిల్లాల రద్దు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ది పొందాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్కు దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తున్నది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు టాక్. ఇదిలాఉండగా, ప్రత్యేక తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్.. పది జిల్లాలను ముందుగా 31 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ నేపథ్యంలో ములుగు,నారాయణపేట వంటి జిల్లాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 33 జిల్లాలు రాష్ట్రంలో ఉన్నాయి. అభివృద్ధి కోసమే జిల్లాలను విభజించినట్టు నాటి సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో జిల్లా కార్యాలయాల భవనాలు పూర్తయ్యాయి.అధికారుల కేటాయింపు పూర్తయింది. పరిపాలన సాగుతోంది.
జిల్లాలను రద్దు చేయడం లేదా తగ్గించడం గానీ చేస్తే రాష్ట్రంలో అగ్గిరాజేస్తానని ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. జనాల అభిప్రాయం, వారి నుంచి వచ్చిన డిమాండ్ మేరకు జిల్లాలను ఏర్పాటు చేసి తాము అభివృద్ధి చేస్తే ఇప్పుడు వాటిని రద్దు చేసి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనుకుంటున్నారా? ఆయనకు పేరు రాకుండా చేయాలనుకుంటున్నారా? లేక ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయాలనుకుంటున్నారా?అని గులాబీ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై సెంటిమెంట్ రాజేసి మున్సిపల్ ఎన్నికల్లో అధికారపార్టీని దెబ్బతీయాలని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.గత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పరాభవానికి రీవెంజ్ తీసుకోవాలని చూస్తున్నదని టాక్.
Telangana Politics: కవిత త్యాగం.. అజారుద్దీన్ మంత్రి పదవికి తప్పిన గండం
మీకోసం మేమున్నామంటూ బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్లి జిల్లాల రద్దు అంశాన్ని సీన్ చేయాలని చూస్తున్నారని చర్చ జరుగుతున్న వేళ.. ప్రతిపక్షాల ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు స్పందిస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన జిల్లాలు అశాస్త్రీయంగా ఉన్నాయని.. ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో ఏర్పాటైందని.. అది సరికాదని.. అంటున్నారు.అందుకే జిల్లాల పునర్విభజనపై ఓ కమిటీ ఏర్పాటు చేసి అది ఇచ్చే నివేదిక ఆధారంగా శాస్త్రీయంగా జిల్లాలను పునర్విభజన చేస్తామని.. రద్దు చేయడం.. తగ్గించడం ఏమి ఉండదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.ఇక ములుగు జిల్లా, జనగాం జిల్లాలను రద్దు చేస్తారా? అంటూ వచ్చిన ఆరోపణలపై అదేమి ఉండదని మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎత్తులకు ఇప్పుడే చెక్ పెట్టాలని అధికారపార్టీ పై ఎత్తులు వేస్తున్నట్టు తెలుస్తున్నది.