BRS : దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి..బీఆర్ఎస్ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్ సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి పేరు అమల్లోకి వచ్చింది. కేసీఆర్ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు. బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ కండువాను కప్పుకున్నారు. ఆవిర్భావ వేడుకలకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీనటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు.
ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణసంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.