రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలమైన ప్రతిపక్షంగా తాము ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిసమయంలో కాంగ్రెస్ సర్కార్ ఏదో ఒక విచారణ పేరిట ప్రజలను డైవర్షన్ చేస్తున్నదని ఫైర్ అయ్యారు.ఇలా ఇంకెన్ని రోజులు చేస్తారని ప్రశ్నించారు. ఇంతవరకు వేసిన సిట్లు ఏమయ్యాయని.. విచారణ నివేదికలు ఏం చేశారని పరోక్షంగా ప్రశ్నించారు. కొత్తగా సీబీఐ విచారణ అంటున్నారని.. ఇక ఈ టర్ము అంతా ఇలాగే ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఫిక్స్ అయ్యారా? అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన రెండేండ్లలో ఏం చేశారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
రైతులు పండించిన పంటలను కొంటారా? లేదా 70 లక్షల తెలంగాణ రైతుల చేతుల్లో తన్నులు తింటారా? తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.చివరి గింజ కొనేవరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. పంటలను కొనకుంటే రైతులు నాగళ్లను మడత పెట్టి సరిహద్దుల వరకు ఉరికిస్తారని చెప్పారు.నిన్న వరంగల్ సభలో ఆయన రైతు సమస్యలపై మాట్లాడారు. రైతులు ఆందోళన చెందొద్దని, ఆత్మహత్యల గురించి ఆలోచించవద్దని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కాలర్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీని నిలదీద్దామని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను తన్ని తరుముదామన్నారు.కొన్న పంటలకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న ఏకైక ఉద్దేశంతోనే రైతన్నలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు రూ.50 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి.. చివరికి రూ.12 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, దీంతో అనేకమంది రైతులు అప్పుల పాలయ్యారన్నారు. రైతుల ఖాతాల్లో రైతు బంధు రావడం లేదు కానీ రాహుల్ గాంధీకి మాత్రం ప్రతి నెలా ఠంచనుగా డబ్బులు పడుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో రుణమాఫీ అంశంలో చర్చకు రావాలని రేవంత్ రెడ్డిని సవాలు చేస్తే.. పిరికిపందలా పారిపోయారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మూడేళ్ల లోపే రూ.3.70 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరికి దోచి పెట్టిందని ప్రశ్నించారు..
సూపర్ స్టార్ వ్యూహం.. దళపతికి చెక్! విజయ్ సీఎం కాకుండా రజనీకాంత్ అడ్డుపడుతున్నారా?
పంటల కొనుగోలును పక్కకు పెట్టి కమీషన్లు, కాంట్రాక్టుల పైననే దృష్టి సారించిందన్నారు.రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభ పరిస్థితులు ఉన్నా రైతు మరణాలు కొనసాగుతున్నా.. ఇప్పటిదాకా ఒక్క సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించలేదన్నారు.మరోవైపు ఆరు గ్యారెంటీలు సైతం అటకెక్కాయన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. తులం బంగారం, మహిళలకు రూ.2500, బోనస్, కౌలు రైతులకు రూ.12 వేలు, రుణమాఫీ, పెట్టుబడిసాయం, విద్యార్థినులకు స్కూటీలు, వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్ పెంపు ఎక్కడా అని కేటీఆర్ నిలదీశారు. ప్రజలు ఎక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తారో లేదా తాము గుర్తుచేస్తున్నామని.. ప్రతిపక్షంపై కక్షపూరిత చర్యలకు సీఎం రేవంత్ పాల్పడుతున్నారని.. ఈ క్రమంలోనే విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాల పేరిట సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారని మండిపడ్డారు.