సగం సినిమా ముగిసిన తరువాత .. ఇక సర్కార్ చేతిలో ఉన్న ఒకే ఒక చివరి అస్త్రం ధరణిని బయటకు తీశారు. వరుసగా అన్నీ బయటకు తీశారు. విచారణలు, సిట్ల పేరుతో రెండున్నరేండ్లు కాలం గడిపారు. ఏ ఒక్క దాంట్లో కూడా శిక్షలు పడలేదు. శిక్షలు పడలేదు అంటే.. నేరం జరగలేదని అనుకోవాలా? నేరం రుజువు చేయలేకపోయారని భావించాలా?
ఏం అనుకున్నా.. జనాలకు మాత్రం సర్కార్పై విశ్వాసం పోయింది. కేవలం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప.. మధ్యలో జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తున్నారే గానీ, ఈ రెండు పార్టీలు బాగానే ఉన్నాయని అనుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడగానే ధరణిని బంగాళఖాతంలో కలుపుతామన్నారు. అలాగే చేశారు. కానీ దీని వల్ల ఎన్ని ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయో లెక్కలు ఇప్పటి వరకు తేల్చలేదు.
ఆదిలో వేల ఎకరాలు బీఆరెస్ లీడర్ల చేతులు మారాయని ఆరోపణలైతే బలంగానే చేశారు. కానీ దీనిపై ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. భూమాత పేరుతో దీన్ని మార్చినా.. పెద్దగా ఇందులో తేడాలేవీ లేవని రెవెన్యూ అధికారులే పెదవి విరిచారు. ప్రభుత్వాలు మారినా.. ధరణి సిస్టమ్లో పెద్దగా తేడాలేమీ లేవని వారే ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై .. కేటీఆర్ ఈ భూముల పందేరంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు.
నిషేధిత భూముల వ్యవహారంలో తాము కొన్నింటినే చేర్చితే కాంగ్రెస్ సర్కార్ ఏకంగా లక్ష ఎకరాలను నిషేధిత భూముల లిస్టులో చేర్చి.. వీటిని చేజిక్కించుకోవాలనుకుంటుందనే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సీఎం.. అతని సోదరులకు కూడా భూ పందేరాలతో లింకు పెడుతూ.. బీఆరెస్తో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి.
ఈ కార్ రేసుతో మొదలైన విచారణ పర్వం.. కాళేశ్వరంతో పీక్కు వెళ్లి.. ఫోన్ ట్యాపింగ్లో ఇక కేటీఆర్ రేపో మాపో అరెస్టవడం ఖాయమనే విధంగా రాజకీయాలను రెండున్నరేండ్లుగా గడిపేశారు. దీపావళికి ముందే బాంబులు పేలుతాయని.. హింట్ ఇచ్చి ఆసక్తికర రాజకీయాలను నడిపారు. తీరా జనాలు అన్నీ దగ్గరగా చూశాకా.. ఇక గవర్నమెంట్కు ఏదీ చాతకాదని తేలిపోయింది.
అందుకే అవినీతి ఆరోపణలపై, సిట్ ఏర్పాట్లపై , దర్యాప్తులపై మొదట చూపిన ఆసక్తిని ఇప్పుడు కనబరచడం లేదు. భూముల వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు కూడా ఏం తక్కువ తినలేదనే ఆరోపణలు ఈ రెండున్నరేండ్లలో మూటగట్టుకున్నది కాంగ్రెస్ సర్కార్. దీంతో ఇప్పుడు ధరణిపై దర్యాప్తు అనగానే నవ్వుకుంటున్నారు. ఇదీ ఓ కాలయాపన కమిటీ అని లైట్ తీసుకుంటున్నారు.
అలా అనుకోవడం వెనుక సర్కార్ వైఫల్యము కూడా లేకపోలేదు. కాళేశ్వరం లక్ష కోట్లు అవినీతి అంశాన్ని కొండంత రాగం తీసి అన్నట్టుగా.. దీన్ని సీబీఐకి అప్పగించి చేతులెత్తేసింది. కనీసం దాన్ని రిపేరు చేసి వాడుకలోకి తెస్తామని, తప్పులు సరిదిద్దుతామని కూడా ప్రకటన చేయలేని దుస్థితిని తెచ్చిపెట్టుకున్నది. అప్పుడే తమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ ప్రారంభిస్తామని, మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కన్నెపల్లి పంప్హౌజ్ నుంచి నీటి విడుదల ఎలా సాధ్యమని..? ఇలా తను వేసిన అవినీతి ఆరోపణల అస్త్రాల నుంచే తప్పించుకునే క్రమంలో సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయినట్టుగా సర్కార్ వ్యవహరిస్తోంది.
బీఆరెస్ కూడా ఏదో ఒక దాంట్లో తాము జైలుకు పోవాలనే చూస్తుంది. ఇప్పుడు జైలుకు పంపలేరు. ఎలాంటి చర్యలు తీసుకోలేరు. ఒక్కటే నిర్దారణ .. బీఆరెస్ పాపాలు ఇవీ.. అని జనం ముందుంచడమే కాంగ్రెస్ పని. కానీ నేరానికి శిక్ష వేయడం మాత్రం తమ పరిధి కాదన్నట్టుగానే రేవంత్ సర్కార్ వ్యవహరించడం.. జనాలకూ నచ్చలేదు. ఇప్పుడు ఎంత ఎక్కువగా ఆరోపణలు చేస్తే అంతగా బీఆరెస్పై సానుభూతి చూపేలా ఉన్నారు. పరిస్థితి రివర్స్ అయ్యింది మరి.