ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు..!అని భైరవ .. మగధీరలో షేర్ఖాన్కు సవాల్ విసిరితే.. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్.. కేటీఆర్కు సవాల్ విసిరాడు. ఏమని..? ఒక్కరిని కాదు.. ఏకంగా డెబ్బైవేల మంది ఉద్యోగార్థులను ఎల్బీ నగర్ స్టేడియంకు తీసుకువస్తానన్నాడు.
లెక్క ఎక్కువైనా పర్లేదు.. ఒక్కరు తగ్గకుండా వంద మందిని పంపించు.. అని అక్కడ సినిమాలో డైలాగు.. ఇక్కడ డైబ్బై వేల మందికి ఒక్కరు తగ్గినా నా తలనరుక్కుంటా..! సంపత్ డైలాగ్. ఇదంతా ఎందుకంటే.. ఇవాళ యువ సంగ్రామం పేరుతో బీఆరెస్ చేపట్టిన సభలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ నుంచి స్పందన. లీగల్గా ముందుకు పోకుండా కాళ్లకు అడ్డంకిగా మారారు కాబట్టే.. డెబ్బైవేల దగ్గర ఆగిందని, లేదంటే… ఇప్పటికే మరిన్ని ఉద్యోగాలిచ్చేవాళ్లమని కూడా తెలిపాడాయన.
చేసిందంతా చేసి ఇప్పుడు చంపినోడే సంతాప సభ పెట్టినట్టు కేటీఆర్.. యువ సంగ్రామ సదస్సు పెట్టాడని విమర్శించాడు సంపత్. అంతే కాదు ఈ చెప్పే నీతులేవో ఆ పదేళ్లలో పాటించి ఉంటే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నాడు. ఆల్రెడీ కేటీఆర్ రాజకీయ సన్యాసంలోనే కొనసాగుతున్నాడని, ఇక కొత్తగా రాజకీయ సన్యాసం చేయాల్సిన పరిస్థితి లేదన్నాడు. విషయమేమింటంటే.. కాంగ్రెస్ పదే పదే చెప్పుకుంటున్న 70వేల ఉద్యోగాల లెక్కపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డాడు.
తామిచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలిచ్చి.. అవి కూడా తమ ఖాతాలో కలుపుకుంటున్నారని.. కరెక్టుగా లెక్క తీస్తే.. ఓ పదివేల ఉద్యోగాలు కూడా ఇచ్చి ఉండరని ఎద్దేవా చేస్తూ సభలో మాట్లాడాడు. ఇదే కాంగ్రెస్కు విపరీతమైన కోపాన్ని తెచ్చిపెట్టింది. ఓవైపు .. ఈ సభకు పోటీగా.. ధీటుగా.. గాంధీభవన్లో బల్మూరి వెంకట్.. తెలంగాణలో ఉద్యోగాల జాతర పేరుతో ఓ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాడు.
అప్పుడు పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? నిరుద్యోగులు ఎలా ఇబ్బందులు పడ్డారు..? అనే విషయాలను చెబుతూనే.. రెండున్నరేండ్లలోనే కాంగ్రెస్ సర్కార్ ఎన్ని వేల ఉద్యోగాలిచ్చిందనే విషయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. అయితే ఈ వేదికగా చాలా మంది నిరుద్యోగులతో మాట్లాడించాడు కేటీఆర్. వారంతా .. కాంగ్రెస్ను గెలిపించేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగామని అన్నారు. అంటే.. కాంగ్రెస్ను గెలిపించేందుకు అంతగా కష్టపడిన ఆ నిరుద్యోగులే.. బీఆరెస్ను మళ్లీ గెలిపించాలని అనుకోలేదు.
ఎందుకు? వారికి జాబ్ల విషయంలో అన్యాయం జరిగిందనే కదా! ఓ రకంగా ఆ వేదిక మీద తమను తాము తిట్టించుకున్నట్టుగా కూడా అయ్యిందనే చర్చ జరిగింది. మొత్తానికి ఈ వివాదాన్ని బీఆరెస్ కూడా పెంచి పెద్దది చేయాలనే చూస్తున్నది. ఎందుకంటే..నిరుద్యోగుల్లో కాంగ్రెస్ సర్కార్ పట్ల విపరీతమైన కోపం ఉంది. ఇప్పుడు వారు బీఆరెస్ను ఎంత తిట్టినా.. నిరుద్యోగులు మాత్రం బీఆరెస్ పక్షానే ఉండేలా ఉన్నారు. ఎందుకంటే ప్రశ్నించడం, నిలదీయడం ద్వారా తమకు ఆ రెండున్నరేండ్లలోనైనా.. సర్కార్ జాబ్లకు నోటిఫికేషన్లు వేస్తుందని నిరుద్యోగులు భావిస్తున్నారు.