BRS Protest: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం భారీ నిరసన చేపట్టాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘420 హామీలు – 420 ఫిట్లు’ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ, ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలతో కూడిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. దేవుళ్ల సాక్షిగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ విస్మరించి ప్రజలను వంచించిందని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 సాయం, తులం బంగారం, రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్ల పెంపు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ వంటి కీలక హామీలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also read: ఎంపీ ధర్మపురి అరవింద్కు బిగ్ షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!
ఈ ఆందోళనలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండ శ్రీనివాస్, వాల బాలకిషన్రావు, పోల్నేని సత్యనారాయణరావు, నైనేని తిరుపతిరావు, పింగిలి రమేశ్లతో పాటు నియోజకవర్గ పరిధిలోని వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.