Fake Currency: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న గ్యాంగును శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు బాలాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.91లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ కే.ఎస్.రావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చింతల్ తండాకు చెందిన రామావత్ రాము అలియాస్ మహ్మద్ (36) వృత్తిరీత్యా జొమాటో డెలివరీ బాయ్. అదే తండాకు చెంది ర్యాపిడో డ్రైవర్ గా పని చేస్తున్న రామావత్ మోతీలాల్ (35), ఆటోడ్రైవర్ రామావత్ గాంధీ (19), నాగోల్ బండ్లగూడకు చెందిన సుధీర్ జాన్ చేలా అలియాస్ వంశీతో అతనికి పరిచయం ఉంది.
జొమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్న పనితో ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో రామావత్ రాము తేలికగా డబ్బు సంపాదించేందుకు నకిలీ నోట్ల దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బంధువైన రామావత్ మోతీలాల్ తో కలసి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లలో నకిలీ నోట్ల తయారీ వీడియోలు చూశాడు. మోతీలాల్ యూ ట్యూబ్లో దొరికిన ఓ ఫోన్ నెంబర్ ను సంప్రదించి అవసరమైన ప్రింటర్, స్కానర్, బాండ్ పేపర్ల వివరాలు తెలుసుకున్నాడు. ఆ తరువాత రామావత్ మోతీలాల్, రామావత్ గాంధీతో కలిసి ప్రింటింగ్ పరికరాలు కొనుగోలు చేశారు.
Also read: అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవోగా జితేంద్ర మిశ్రా!
అచ్చం అసలు నోట్లలా కనిపించేలా వాటర్ మార్క్ లతో నకిలీ నోట్లను తయారు చేశారు. రాత్రి వేళల్లో వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లలో ఈ నోట్లను చలామణి చేయడం ప్రారంభించారు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ డీ.కృష్ణమోహన్, బాలాపూర్ సీఐ సుధాకర్, ఎస్ఐ మన్సూర్ అలీతోపాటు సిబ్బందితో కలిసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు అసలైన 500 రూపాయల నోట్లు, నాలుగు వంద రూపాయల నోట్లతోపాటు 2.91లక్షల నకిలీ కరెన్సీ, ప్రింటర్, స్కానర్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం బాలాపూర్ పోలీసులకు అప్పగించారు.
Also read: రిటైర్మెంట్ ఇచ్చే వరకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొనసాగుతాడు